ప్రజాస్వామ్య దేశంలో పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. చర్చించి.. ప్రశ్నించి.. సమాధానబరిచి ఆమోదం పొందాల్సిన బిల్లులు.. చర్చలు, ప్రశ్నలు, సమాధానాలు లేకుండానే పాసైపోతున్నాయి. ఆ బిల్లుల సంగతి అటుంచితే, పదో.. ఇరవయ్యే కాదు.. యాభయ్యో.. వందో కూడా.. ఏకంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి.. సభను నడుపుకోవడం ఏ తరహా ప్రజాస్వామ్యమో బీజేపీ సర్కారుకే తెలియాలి. విపక్ష ఎంపీలు ఎవరూ రచ్చ చేయలేదు.. వెల్ లోకి దూసుకు రాలేదు. స్పీకర్ పోడియంను చుట్టుముట్ట లేదు. స్పీకర్ కుర్చీని తోసేయలేదు. పత్రాల్ని చించేయటం.. ఇలాంటివేమీ చేయలేదు. వారు చేసిందల్లా.. అత్యంత భద్రతో ఉన్న పార్లమెంటులోకి నిరసన పేరుతో ఆరాచకాన్నిక్రియేట్ చేసి.. పార్లమెంటు భద్రతలోని లోపాల్ని .. డొల్లతనాన్ని ఎత్తి చూపిన ఉదంతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు వచ్చి.. సభలోని సభ్యులకు వివరణ ఇవ్వాలని కోరారు.
భారతదేశ చరిత్రలో పార్లమెంటు భవనంలోకి అరాచక శక్తులు ఎంట్రీ ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. ఈ ఉదంతంలో భద్రతా వ్యవస్థలోని లోపాలు కళ్లకు కట్టినట్లుగా కనిపించాయి. అంతేకాదు.. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూసుకొచ్చే అవకాశం ఉండటం ఏమిటి? నిఘా వర్గాలు.. భద్రతా వర్గాలు ఏం చేస్తున్నట్లు? అన్నది ప్రాథమిక ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలను లేవనెత్తడం ఆ ఎంపీల తప్పుగా మారినట్లు కనిపిస్తోంది. మోడీ సర్కారు ఎంపీలను సస్పెండ్ చేసుకుంటూ పోతోంది. మూడు రోజుల క్రితం ఒకే ఉదంతంపై ఒకే సారి 92 మంది ఎంపీల్ని శీతాకాల సమావేశాల వరకు బహిష్కరిస్తున్న షాకింగ్ మారితే.. ఆ లెక్క ఇప్పుడు 146కు చేరింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ.. వారి నుంచి సమాధానం రాబట్టేందుకు ఆందోళన చేసిన వారిని సస్పెండ్ చేస్తూ పోవడం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఇదంతా చూస్తున్న వారికి మోడీ రాజ్యంలో అమిత్ షాను సభకు వచ్చి వివరణ ఇవ్వాలని కోరటం ఇంత నేరమా? అన్నది ప్రశ్నగా మారింది.
దీనిపై ఇండియా కూటమి నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 60 శాతం భారతీయుల గొంతు నొక్కిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ ద్వేషం వ్యాపింపజేస్తే, ఇండియా పార్టీలు ప్రేమను పంచుతాయన్నారు. ఎంపీల సస్పెన్షన్పై విపక్ష ఇండియా కూటమి దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే.. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో సాయంత్రం 4 వరకు ధర్నా కొనసాగింది.
పార్లమెంట్లో ఆ స్థాయిలో ఎంపీలను సస్పెండ్ చేయడం అక్రమం. అప్రజాస్వామికం. కారణం ఏదైనా భారత పార్లమెంట్ చరిత్రలో ఈ సస్పెన్షన్లు ఓ మచ్చగా మిగిలిపోతాయి. పార్లమెంట్లో స్మోక్ కలర్ ఘటన అంశంలో కేంద్రం స్పందించి తగు చర్యలు తీసుకున్నప్పటికీ.. దానిపై సభలో కూడా చర్చకు అవకాశం ఇచ్చి ఉంటే హుందాగా ఉండేది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీలు అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతుండడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE