జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 1 నుంచి రాయలసీమలో పర్యటించనున్నారు. డిసెంబరు 1 నుంచి డిసెంబర్ 6 వరకు ఆరు రోజులపాటు సాగే రాయలసీమ జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో చిత్తూరు, కడపలో పర్యటించి, ఆ జిల్లాల్లో ఉన్న పలు సమస్యలపై రైతులు, మేధావులతో చర్చించనున్నారు. అపరిష్కృతంగా ఉన్నా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనలో, సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్న వారి ప్రతినిధులను ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ స్వయంగా కలుసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. డిసెంబరు 1న మధ్యాహ్నం ఒంటిగంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా కడప జిల్లాకు వెళ్తారు.
3 గంటలకు రైల్వే కోడూరు చేరుకొని కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు. కడప జిల్లా పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరుపతి వెళతారు. 2వ తేదీ ఉదయం 10 గంటలకు గత ఎన్నికల్లో తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 3వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, నాయకులతో సమీక్ష జరుపుతారు. 4వ తేదీ మదనపల్లె చేరుకుని అక్కడి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. 5వ తేదీన అనంతపురం జిల్లా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించి, స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చిస్తారు. 6వ తేదీన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, రాయలసీమ జిల్లాల్లో అక్రమ కేసులు బనాయించడం వల్ల ఇబ్బందులు పడుతున్న జనసేన నాయకులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వనున్నారు.
[subscribe]



