తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ముందుగా కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు. ఈ భేటీలో శాలువా, జ్ఞాపికతో మంత్రి స్మృతి ఇరానీని కేటీఆర్ మర్యాపూర్వకంగా సత్కరించారు.
అదేవిధంగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తో కూడా మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఫార్మా సిటీలో జరిగిన అభివృద్ధిని ప్రకాశ్ జవదేకర్ కు వివరించి, ఇకపై కూడా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తో సమావేశం అనంతరం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న టిఆర్ఎస్ ఎంపీలతో కేటీఆర్ భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని టిఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి టిఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావుతో పాటుగా ఇతర ఎంపీలు హాజరయ్యారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో ఎంపీలంతా గట్టిగా పోరాడాలని ఈ సందర్భంగా కేటీఆర్ వారికీ సూచించారు.
[subscribe]