ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా వివిధ కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకోగా, తాజాగా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ఈ సీజన్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే హర్భజన్ సింగ్ ఈ సంవత్సరం జట్టుకు దూరమవుతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు చెన్నై జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, సిబ్బంది సహా మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరందరిని క్వారంటైన్ లోనే ఉంచారు. 14 రోజుల ఐసోలేషన్ అనంతరం పరీక్షలు నిర్వహించి ప్రాక్టీస్ సెషన్ కు అనుమతించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu