హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ లో ఈ రోజు జరిగిన ‘దీక్షంత్ పరేడ్ ఈవెంట్’ సందర్భంగా ఐపీఎస్ ప్రొబేషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ఈ సందర్భంగా ఐపీఎస్ ప్రొబేషనర్లు తమ శిక్షణను విజయవంతం చేయాలని ప్రధాని మోదీ కోరారు. ఖాకీ యూనిఫాంకి ఉన్న గౌరవాన్ని ఎప్పుడూ కోల్పోకూడదని సూచించారు. కరోనా సమయంలో పోలీసులు ముందుండి పోరాడిన తీరు ప్రజల్లో నిలిచిపోతుందని అన్నారు. సాధారణ ప్రజలపై కరుణ చూపాలని ఐపీఎస్ లను ప్రధాని కోరారు. భయం ద్వారా వారిని నియంత్రించడం కంటే కరుణ ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటే, గుర్తింపు ఎక్కువ కాలం ఉంటుందని చెప్పారు.
ఒక నేరాన్ని పరిష్కరించడంలో సహాయపడే కాన్స్టాబులరీ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యతను ప్రధాని వివరించారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ప్రాముఖ్యతను మరచిపోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువుగా ఉపయోగించుకోవాలని ఐపీఎస్ లను ప్రధాని మోదీ కోరారు. గత కొన్నేళ్లుగా ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ విపత్తు సమయంలో ప్రదర్శించిన విధానం పోలీసు సేవకు కొత్త గుర్తింపు తెచ్చిందని ప్రధాని అన్నారు. ఎన్డిఆర్ఎఫ్ గ్రూపులను ఆయా ప్రాంతాల్లో నిర్వహించి, ప్రకృతి విపత్తు సమయంలో ప్రజలకు సహాయం చేయాలని కోరారు. పోలీస్ వ్యవస్థలో ఫిట్నెస్ ప్రాముఖ్యత గురించి ప్రధాని వివరించారు. శిక్షణ సమయంలో అభివృద్ధి చేసిన ఫిట్నెస్ను కొనసాగించాల్సి ఉందని అన్నారు. మీరు ఆరోగ్యంగా ఉంటే, మీ చుట్టూ ఉన్న సహచరులు కూడా ఆరోగ్యంగా ఉంటారని, వారు మిమ్మల్ని చూసి ప్రేరణ పొందుతారని అన్నారు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎస్ లను స్వయంగా కలవలేకపోయానని, కానీ తన పదవీకాలంలో ఖచ్చితంగా అందరినీ ఏదో ఒక సమయంలో కలుస్తానని ప్రధాని మోదీ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu