
తెలుగు వారికి దసరా పండుగ అంటే తొమ్మిదిరోజుల పండుగ. ఇక పిల్లలయితే ఎప్పుడు దసరా పండుగ వస్తుందా ఎప్పుడెప్పుడు దసరా శెలవులు ఇస్తారా అని ఎదురుచూస్తుంటారు. ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రులను నిర్వహించి ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు.అలా ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి 24 వరకు దసరా నవరాత్రిళ్లు జరుపుకుంటారు.
దుర్గా మాత భూమిపైకి వచ్చే వాహనాన్ని బట్టే.. పంచాగకర్తలు, జ్యోతిష్యులు భవిష్యత్ కాలాన్ని లెక్కగడతారు. నిజానికి దుర్గా దేవి వాహనం సింహమే అయినా… ప్రతి దసరా పండుగకు అమ్మవారు తొమ్మిదిరోజుల పాటు ఒక్కో దానిపై సవారీ చేస్తారట. దసరా సమయంలో కొంతమంది దీక్షతీసుకొని తొమ్మిది కఠిన నియమాలు పాటిస్తారు. 9 రోజుల పాటు కొనసాగే నవరాత్రులలో దుర్గా దేవిని తొమ్మిది రూపాలలో పూజిస్తుంటారు. అయితే ఈ ఏడాది వచ్చిన దసరా ముహూర్తం.. అత్యంత ప్రత్యేకమైనదని.. ఏకంగా 30 ఏళ్ల తర్వాత వచ్చిందని పండితులు చెబుతున్నారు.
చాంద్రమానం ప్రకారం శోభకృత్ నామ సంవత్సరం అయిన 2023లో .. సాక్షాత్తూ దుర్గాదేవి దిగివచ్చి ఏనుగుపై భూమిని దర్శించనుందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది నవరాత్రులు 30 సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన ముహూర్తమని అంటున్నారు. ఈ ఏడాది నవరాత్రుల మొదటి రోజు, బుధ ఆదిత్య యోగం, షాష రాజ్యయోగం , భద్ర రాజ్యయోగం అనే శుభ యోగాలున్నాయని ..ఈ యోగాల కలయిక చాలా విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా నవరాత్రిళ్ల సమయంలో ఇలాంటి యోగాల ఉండటం వల్ల ఇది ఎంతో పవిత్రమైనదని అంటున్నారు. అందుకే ఈ ఏడాది తగినన్ని వర్షాలు కురుస్తాయంటున్నారు పండితులు .
సాధారణంగా తెలివితేటలు, తర్కం, ప్రసంగం, వ్యాపారం, ఇతర సంబంధిత విషయాలకు చిహ్నంగా బుధుడిని చెబుతూ ఉంటారు. రాజు, ప్రభుత్వం, తండ్రి, ఉన్నత పరిపాలనా స్థానాలకు ఏకకాలంలో సూర్యుడు కూడా కారకంగా భావించి.. బుధ ఆదిత్య యోగంగా పరిగణిస్తారు. అంటే సూర్యుడు దీనికి అదనంగా ఒక వ్యక్తికి శక్తితో పాటు జీవిత శక్తిని కూడా ఇస్తాడన్న మాట. ఈ రెండు అత్యంత శక్తివంతమైన గ్రహాలు.. ఈ రెండు కలిసి వచ్చినప్పుడు, ప్రజల జీవితాలలో వాణిజ్యపరమైన లేదా విద్యాపరమైన పురోగతికి సంబంధించిన మంచి ఫలితాలను లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అలా బుధుడు, సూర్యుడు కలిసి అక్టోబర్ 15 న ఒకే ఇంటిలోకి వస్తున్నారని.. అందుకే ఆరోజు బుధ ఆదిత్య యోగం కూడా ఉంటుందని అంటున్నారు.
అక్టోబర్ 15న శని గ్రహం కుంభరాశిలో తిరోగమనం చేసి 6 నెలల పాటు అదే రాశిలో ఉంటాడని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా శనితో పాటు మరో రెండు గ్రహాలు కూడా 180 రోజుల పాటు కుంభరాశిలోనే ఉంటాయని అంటున్నారు. ఈ మూడు గ్రహాలు తిరోగమనం వల్ల.. కేతు షాష రాజ్యయోగం ఫలితాలు పేర్కొంటున్నారు.
అంతేకాదు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పంచ మహా పురుష యోగానికి జాతక కుండలిలో చాలా ప్రాముఖ్యత ఉంది. జాతకంలో బుధుడు, కుజుడు, గురు, శుక్రుడు, శని గ్రహాలు బలమైన స్థానంలో ఉంటున్నపుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి. అలా ఈ పంచ మహాపురుష యోగాల వల్ల.. బృహస్పతితో హంస యోగం, బుధునితో భద్ర యోగం అలాగే శుక్రుడుతో మాలవ్య యోగం, కుజుడు ద్వారా రుచక్ యోగం, శని ద్వారా శాస యోగాలు ఏర్పడతాయి. ఈ కారణం వల్లే అక్టోబర్ 15న భద్ర రాజయోగం ఏర్పడనుంది.