తెలంగాణలో జంపింగ్ జపాంగ్ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ నేతలు చొక్కా మార్చుకున్నంత ఈజీగా పార్టీలు మారుతున్నారు. నిన్న ఉన్నవాళ్లు ఈరోజు ఆపార్టీలో కనిపించడం లేదు. నమ్ముకొని ఉన్న పార్టీలు మొండి చేయి చూపించడంతో.. పంగనామాలు పెట్టి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు అసంతృప్తి నేతలు ఇతర పార్టీల్లోకి దూకేశారు. ఈక్రమంలో అసంతృప్తిగా ఉన్న నేతలపై బీఆర్ఎస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారిని సంతృప్తి పరిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు.. అంతకంటే ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి దిగ్గజ నేతలు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేశారు. హస్తం పార్టీలో చేరిపోయారు. వారే కాకుండా జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో కూడా పలువురు నేతలు బీఆర్ఎస్కు బై బై చెప్పారు. టికెట్ దక్కలేదని కొందరు.. పార్టీలో అవమానాలు తట్టుకోలేక మరికొందరు.. పార్టీలో ఇతర సమస్యల వల్ల ఇంకొందరు.. బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. అయితే ఇలా అసంతృప్తులు పార్టీలో నుంచి వెళ్లడం పెద్ద మైనస్గా భావించిన అధిష్టానం వారిని బుజ్జగించే పనిలో పడింది.
అసంతృప్తులను సంతృప్తి పరిచేందుకు అధిష్టానం పదవుల ఆశ చూపెడుతోంది. కొందరికి నామినేటెడ్ పదవులను కూడా కట్టబెట్టింది. టికెట్ దక్కకపోవడంతో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయనకు రైతుబంధు సమితి ఛైర్మన్ పదవిని కట్టబెట్టి కూల్ చేసింది. అటు అసంతృప్తిగా ఉన్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూడా ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇచ్చింది. అయినప్పటికీ అసంతృప్తిగా ఉన్న నేతలతో మంత్రి కేటీఆర్, హరీష్ రావులు వరుసగా సమావేశమవుతూ.. వారిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఇతర పార్టీల్లోకి జంప్ అవకుండా ఆపుతున్నారు.
ఇక్కడే బీఆర్ఎస్ అధిష్టానం ఇంకో వ్యూహం కూడా అనుసరిస్తోంది. ఓవైపు అసంతృప్తులను సంతృప్తి పరుస్తూనే.. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇతర పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను తమవైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో టికెట్ దక్కే అవకాశం లేక అసంతృప్తులుగా ఉన్న వారిని ఆకర్షించడంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఆయా పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు వరుసగా సమావేశమవుతూ బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు.
దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బిల్యానాయక్.. కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ దేవరకొండ కాంగ్రెస్ టికెట్ బాలూనాయక్కు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో నిరాశతో ఉన్న బిల్యానాయక్తో మంత్రి కేటీఆర్ సమావేశమై పార్టీలోకి ఆహ్వానించారు. ఆ వెంటనే బిల్యానాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే టికెట్ ఇవ్వకపోయినా.. ఇతర పదవులు ఇస్తామని ఆశ చూపెట్టడంతో పార్టీలో చేరిపోయారు. అటు మెదక్ కాంగ్రెస్ టికెట్ మైనంపల్లి రోహిత్ రెడ్డికి ఖరారయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో ఆ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డితో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. స్వయంగా ఇంటికెళ్లి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. రేపో.. మాపో శశిధర్ రెడ్డి కారు ఎక్కే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే పెద్ద ఎత్తున ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలు బీఆర్ఎస్లో చేరిపోయారు. అయితే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాక మరికొంత మంది గులాబీ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. ఓవైపు తమ పార్టీలో అసంతృప్తులను తృప్తి పరుస్తూనే.. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.