జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ఈ రోజు సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మెహాన్ లతో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ సమయాన్ని జీహెచ్ఎంసీ రోడ్ల నిర్మాణం వంటి పనులకు చక్కగా వినియోగించుకున్నారని, ఈ విషయంలో ప్రజలనుంచి మంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. చాలా మంది లాక్ డౌన్ అనంతరం బయటకు వచ్చి తమ కాలనీల్లో మారిన రోడ్లను చూసి హర్షం వ్యక్తం చేశారని ఎమ్మెల్యేలు తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారీగా చేపట్టాల్సిన పనులపైన ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. తమ నియోజకవర్గాల పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడంపైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు. మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం చివరికి సుమారు 75 వేల ఇళ్లు పంపీణీకి సిద్దంగా ఉంటాయని తెలిపారు.
జీహెచ్ఎంసీ ద్వారా పనులు వేగంగా నడుస్తున్నాయని మంత్రి కేటిఆర్ తెలిపారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ చౌరస్తా వంటి చోట్ల మెత్తం రూపురేఖలు మారిపోయాయని, అంత వేగంగా ఇన్ఫ్రా పనులు జరిగాయన్నారు. ఎస్సార్డీపి పనుల ద్వారా అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పెద్ద మహా ప్రస్థానం లాంటి వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే అనుమతులు వచ్చిన చెరువుల అభివృద్ది, సుందరీకరణ పనులు మరింత వేగంగా జరిగేలా చూడాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సానిటేషన్ పనులు భాగానే కోనసాగుతున్నాయని, జల మండలి పరిధిలోకి వచ్చిన సీవరేజి నిర్వహాణపైన కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఫుట్ పాత్ లు, పబ్లిక్ టాయిలేట్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వారికి తెలిపారు. దీంతోపాటు లింక్ రోడ్లు, పార్కుల అభివృద్ది వంటి కార్యక్రమాలు కూడా జీహెచ్ఎంసీకి మంచి పేరు తీసుకువచ్చాయని ఎమ్మెల్యేలు మంత్రికి తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా తమ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన పనుల తాలూకు విజ్ఞప్తులను మంత్రి కేటిఆర్ కు అందజేశారు. అన్నింటికి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటిఆర్ వారికి హమీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu