కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్ డౌన్ ను మరో 2 వారాలు కొనసాగించాలని, లాక్ డౌన్ సమయంలో అటు రైతులు నష్టపోకుండా, ఇటు నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలగకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిచేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ప్రధాని మోదీ ఏప్రిల్ 11, శనివారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నాలుగు గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ కొనసాగించాలని అభిప్రాయపడ్డ సీఎం కేసీఆర్ ప్రజల జీవితాలకు, వ్యవసాయానికి, ఆర్థిక అంశాలకు సంబంధించి పలు సూచనలు చేశారు.
భారతదేశం ఏకతాటిపై నిలబడి కరోనా వైరస్ పై పోరాడుతుంది. అంతర్జాతీయ పత్రికలు కూడా ఈ కృషిని మెచ్చుకుంటున్నాయి. రాష్ట్రాలకు కేంద్రం నుంచి కావాల్సిన మద్దతు లభిస్తున్నది. మీరు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మనోధైర్యాన్ని ఇస్తున్నారు. కరోనాపై యుద్ధంలో భారతదేశం తప్పక గెలిచితీరుతుంది. అలాగే భారతదేశానికి వ్యవసాయమే జీవముక అని, దేశానికి అన్నం పెట్టడమే కాదు, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది.135 కోట్ల మన ప్రజానీకానికి తిండి పెట్టడం మరే దేశానికి కూడా సాధ్యం కాదు. మనం ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధితో ఉన్నాం. ఈ పరిస్థితి కొనసాగాలి. అన్నం పెట్టే రైతుకు అండగా నిలవాలని ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కనీసం రెండు నెలల పాటైనా వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలి. కూలీ డబ్బులు సగం కేంద్రం భరించాలి. దేశ వ్యాప్తంగా పండిన కోట్లాది టన్నుల ధాన్యాన్నినిల్వ చేయడానికి స్థలం లేదు. ప్రజలకు మూడు నెలలకు సరిపడా ఆహార ధాన్యాలను ఎఫ్.సి.ఐ.నిల్వల నుండి సమకూర్చాలి. ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం 25 వేల కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. సేకరించిన ధాన్యాన్ని ఎఫ్.సి.ఐ.కి అందిస్తుంది. ఎఫ్.సి.ఐ. నుంచి డబ్బులు తిరిగి వచ్చేవరకు బ్యాంకులు బకాయిల చెల్లింపుకోసం రాష్ట్రాలపై వత్తిడి తేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు.
కరోనా మహమ్మారి వల్ల తలెత్తే ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఆర్.బి.ఐ. క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాన్ని అనుసరించాలని, దీన్నే హెలిక్యాప్టర్ మనీ అంటారని చెప్పారు. దీనివల్ల రాష్ట్రాలకు, నిధులు సమకూర్చే సంస్థలకు వెసులు బాటు లభిస్తుంది. జిఎస్డిపిలో 5 శాతం నిధులను ఈవిధానంలో విడుదల చేయాలి. ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలి. రాష్ట్రాలు చెల్లించే అప్పుల కిస్తీని కనీసం ఆరు నెలల పాటు వాయిదా వేయాలి. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రులతో ఒక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu