ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కనీస మద్దతు ధరకు రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో రూ.84వేల కోట్లు విలువ చేసే 4 కోట్ల 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, అప్పటి నుంచి 2019-20 వరకు ధాన్యం కొనుగోలు చేసిన ఐకేపీ, పిఎసిఎస్, డిసిఎంఎస్ లతో పాటు జి.సి.సి, హాకా వంటి ఇతర ఏజెన్సీలకు రూ.1,029 కోట్ల కమిషనను చెల్లించామని తెలిపారు.
మంగళవారంనాడు పౌరసరఫరాలభవన్ లో మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇదివరకు యాసంగిలో కంటే వానాకాలంలో ఎక్కువ పంటలు పండేవి. ఇప్పుడు దీనికి భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. వానాకాలంలో పండిన పంట కంటే కూడా యాసంగిలో అధిక పంటలు పండుతున్నాయి. దీనికి ఈ ఏడాది యాసంగిలో ధాన్యం దిగుబడి, కొనుగోళ్లే నిదర్శనం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాది 2014-15 యాసంగిలో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, నేడు 2021 యాసంగిలో 92లక్షల మెట్రిక్ టన్నులకు చేరడం అంటే 594 శాతం కొనుగోళ్లు పెరిగాయి, ఇదీ యావత్తు తెలంగాణ రైతాంగం యొక్క విజయంగా అభివర్ణించారు.
92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం:
“ఏప్రిల్ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల కొరకు 6,968 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం, దాదాపు రెండున్నర నెలలపాటు కొనుగోళ్ల ప్రక్రియను నిర్విరామంగా సాగించి రికార్డు స్థాయిలో 15 లక్షల మంది రైతుల నుంచి రూ.17,300 కోట్లు విలువ చేసే 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోళ్లు ముగియడంతో రాష్ట్రంలోని 6,968 కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరిగింది. గత ఏడాది యాసంగి కంటే 28 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేశాం. 80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా అదనంగా 12 లక్షలు (13 శాతం) అధికంగా కొనుగోలు చేశామని తెలిపారు. 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 17వేల కోట్లు కాగా రవాణా, గన్నీ సంచులు, సోసైటీ కమీషనకు అదనంగా దాదాపుగా రూ. 2 వేల కోట్ల వ్యయం అవుతుంది” అని చెప్పారు.
“23 జిల్లాల్లో ముందస్తు అంచనాలకు మించి వంద నుంచి 225 శాతం వరకు కొనుగోళ్లు పెరిగాయి. అత్యధికంగా గద్వాల్ లో 125 శాతం, నారాయణపేటలో 95 శాతం, రంగారెడ్డిలో 83 శాతం, నిర్మల్ లో 44 శాతం, వరంగల్ (రూరల్)లో 64శాతం, సంగారెడ్డిలో 32 శాతం, భూపాలపల్లిలో 33, వికారాబాద్ లో 44 శాతం కొనుగోళ్లు పెరిగాయి. సమైక్య రాష్ట్రంలో రాష్ట్ర అవసరాలకు, పేదలకు రేషన్ బియ్యం ఎక్కడో పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవి. అవి కూడా తినడానికి అంత అనువుగా ఉండేవి కావు. నేడు తెలంగాణ రాష్ట్రంలో పండిన బియ్యాన్ని మనం తినడమే కాకుండా దేశానికి కూడా అందిస్తున్నాం. గత ఏడాది భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన బియ్యంలో తెలంగాణ వాటా 55 శాతం ఉంటడం గర్వకారణం. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం, మార్గదర్శకాల మేరకు పెరిగిన దిగుబడులకు అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ చేపట్టిన చర్యలు రైతాంగంలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యంకాని విధంగా తెలంగాణ పౌరసరఫరాల సంస్థ వందశాతం వరి పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తూ దేశానికే కొత్త మార్గాన్ని చూపిస్తుంది” అని సంస్థ చైర్మన్ మారెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిన జిల్లాలు:
- నల్లగొండ – 7,83,574 (మెట్రిక్ టన్నులు)
- నిజామాబాద్ – 7,55,819
- సూర్యా పేట – 6,49,192
- జగిత్యాల – 5,52,794
- సిద్దిపేట – 5,40,049
- కామారెడ్డి – 4,51,154
- మెదక్ – 4,41,130
- కరీంనగర్ – 4,14,859
- యాదాద్రి భువనగిరి – 4,06,859
- పెద్దపల్లి – 3,89,601
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ