పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. అందుకున్న తెలుగు ప్రముఖులు వీరే!

Padma Awards 2026 President Droupadi Murmu Honours 66 Recipients in Phase 1

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశ ప్రగతికి, విభిన్న రంగాల అభివృద్ధికి నిరుపమానమైన సేవలు అందించిన ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. దిల్లీలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘పద్మ’ అవార్డులను గ్రహీతలకు స్వయంగా బహూకరించారు.

2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 మందికి ఈ పురస్కారాలను ప్రకటించగా, సోమవారం సాయంత్రం జరిగిన తొలి విడత వేడుకల్లో 66 మంది ప్రముఖులకు అవార్డులను అందజేశారు. మిగిలిన వారికి తదుపరి విడతలో అవార్డులను ప్రధానం చేయనున్నారు.

ధర్మేంద్రకు పద్మవిభూషణ్.. ఆకట్టుకున్న ప్రధాని మోదీ మార్క్

కళారంగంలో విశేష సేవలు అందించిన బాలీవుడ్‌ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం ప్రకటించిన పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ఆయన సతీమణి, ఎంపీ హేమమాలిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు ఎన్‌. రాజమ్‌కు సైతం పద్మవిభూషణ్ లభించింది. ఈ వేడుకలో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది.

పుదుచ్చేరికి చెందిన ఒక క్రీడాకారుడు అవార్డు స్వీకరించడానికి వెళ్తూ ముందువరుసలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీకి సాష్టాంగ ప్రమాణం చేయగా, ప్రధాని వెంటనే తన సీట్లోంచి లేచి ఆయన వద్దకు వెళ్లి ఎదురుగా ప్రతి నమస్కారం చేయడం అందరినీ ఆకట్టుకుంది.

తెలుగు ప్రముఖులకు పద్మ పురస్కారాలు

తొలి విడత అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ (మరణానంతరం) తరఫున ఆయన కుమారుడు అనిల్‌కుమార్‌ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

అలాగే ప్రసిద్ధ నృత్యకారిణి దీపికా రెడ్డి, వైద్యరంగంలో సేవలందించిన డాక్టర్‌ గూడూరు వెంకట్‌ రావు, డాక్టర్‌ పాల్కొండ విజయ్‌ ఆనంద్‌ రెడ్డి, సాహిత్య రంగానికి చెందిన ప్రొఫెసర్‌ వెంపటి కుటుంబ శాస్త్రి మరియు యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీశ్‌ కుమార్‌లు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుతో పాటు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, హెచ్‌డీ కుమారస్వామి, గజేంద్రసింగ్‌ షెకావత్‌ వంటి ఎందరో ప్రముఖులు పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here