పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో అక్టోబర్ 6 2019, ఆదివారం నాడు విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు పద్మభూషణ్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యి, విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఆదివారం ఉదయం 10.15 నిమిషాలకు తాడేపల్లిగూడెంలోని యస్.వి.ఆర్.సర్కిల్, కె.యన్.రోడ్ లో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. నట చక్రవర్తి ఎస్వీ రంగారావు విగ్రహ ఆవిష్కరణ, చిరంజీవి చేతుల మీదుగా జరుగుతుందని ఎస్వీఆర్ సేవాసంఘం అధ్యక్షుడు భోగిరెడ్డి రాము ఈ రోజు నిర్వహించిన సమావేశంలో తెలియజేసారు.
ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలి రావాలని చిరంజీవి అభిమానులకు పిలునిచ్చారు. 50 వేల మందికిపైగా పాల్గోనే ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుల సహకారంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 6వ తేదీ ఉదయం మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి తాడేపల్లిగూడెం చేరుకుంటారని చెప్పారు. ఒక వైపు ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండి కూడ ఇచ్చిన మాటకు కట్టుబడి విగ్రహావిష్కరణకు వస్తున్నందుకు ఎస్వీఆర్ సేవాసంఘం ప్రతినిధులు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు.
[subscribe]