గుజరాత్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ను ఎంపిక చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం బీజేపీ నేత భూపేంద్ర పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గుజరాత్ రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ భూపేంద్ర పటేల్ చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్రమంత్రులు అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ, నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ సహా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ముందుగా ఆదివారం నాడు గాంధీనగర్ లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు.
2017లో మొదటిసారిగా ఘట్లోడియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన లక్షకు పైగా ఓట్లతో విజయం సాధించారు. సీఎం రేసులో కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, నితిన్ పటేల్, ప్రఫుల్ పటేల్ పేర్లు వినిపించినప్పటికీ, బీజేపీ అధిష్టానం అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్ వైపు మొగ్గుచూపింది. గుజరాత్ మాజీ సీఎం, ప్రస్తుత యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కు సన్నిహితుడిగా భూపేంద్ర పటేల్ కు పేరుంది. మరోవైపు బీజేపీ అధిష్టానం సూచన మేరకు ఇప్పటి వరకు గుజరాత్ సీఎంగా ఉన్న విజయ్ రూపానీ శనివారం నాడు గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేసిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ