కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంలో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఒక కాంగ్రెస్ దిగ్గజమని, సమగ్ర భారతదేశం కోసం అతని విజన్ సమకాలీన రాజకీయాలపై భారీ ప్రభావాన్ని చూపిందని అన్నారు. కాంగ్రెస్ కుటుంబం ఆయన మార్గదర్శకత్వాన్ని, గైడెన్స్ ను కోల్పోయిందని అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఆస్కార్ ఫెర్నాండెజ్ మార్చి 27, 1941న ఉడిపిలో జన్మించారు. ముందుగా ఉడిపి మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయాల్లోకి అరంగ్రేట్రం చేసిన ఆయన, అనంతరం కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉడిపి లోక్సభ నియోజకవర్గం నుంచి మొత్తం అయిదుసార్లు ఎంపీగా విజయం సాధించారు. అలాగే మూడుసార్లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2009 వరకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేసిన ఆయన, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్నారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ