ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ మన దేశంలో కూడా అడుగుపెట్టి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పుడు తెలంగాణాలో కొత్తగా మరో 2 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఈ 2 కేసులనూ హైదరాబాద్ లోనే గుర్తించారు. విదేశాలనుంచి వచ్చిన హైదరాబాదీయులలో ఒమిక్రాన్ వేరియెంట్ బయటపడింది. ఈ విషయాన్ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో నిర్ధారించారు. కెన్యా నుంచి వచ్చిన 24 సంవత్సరాల మహిళకి ఎయిర్ పోర్ట్ లో టెస్ట్ నిర్వహించగా కోవిడ్ ఎఫెక్ట్ అయినట్లు వచ్చింది. దీంతో జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపించగా ఒమిక్రాన్ వేరియెంట్ పాజిటివ్ గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ మహిళని ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే, ఆ మహిళ నివసిస్తున్న టోలీ చౌకీ ప్రాంతంలో సెకండరీ కాంటాక్టులను గుర్తించి వారి శాంపిల్స్ సేకరించి RTPCR టెస్ట్ కోసం పంపించారు.
కాగా, సోమాలియా నుంచి వచ్చిన 23 సంవత్సరాల మరో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ వేరియెంట్ పాజిటివ్ గా తేలింది. అయితే, ఇతను కూడా టోలీ చౌకీ ప్రాంతానికి చెందినవాడే. ఈ వ్యక్తిని కూడా గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. అతనితోపాటుగా అతను కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించి టెస్టులు చేయటానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, తెలంగాణ ప్రజలు ఎవరూ భయపడొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. టెస్టుల సంఖ్యను కూడా పెంచుతున్నామని, ఎవరైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ