ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో మన బస్తి-మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం ఖైరతాబాద్ లోని రాజ్ భవన్ పాఠశాలలో మన బస్తి-మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి ప్రారంభించారు. అలాగే సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్ పేట డివిజన్ లో గల ధరంకరం రోడ్ లోని ప్రభుత్వ పాఠశాలలో, ముషీరాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, అంబర్ పేటలోని పోలీస్ గ్రౌండ్ లోని ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అందులో భాగంగా మన బస్తి-మన బడి క్రింద రాష్ట్రంలో 26,065 పాఠశాలల అభివృద్ధికి 7259 కోట్ల రూపాయల కేటాయించడం జరిగిందని, మొదటి విడతలో 9123 పాఠశాలల అభివృద్ధి పనులను చేపట్టడం కోసం ప్రభుత్వం 3497 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. మూడు విడతల్లో అన్ని పాఠశాలలను ఈ కార్యక్రమం క్రింద పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 15 నియోజకవర్గాల్లో నేడు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం క్రింద ఆయా పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం, విద్యార్ధులు, ఉపాధ్యాయులకు సరిపడా ఫర్నిచర్ ఏర్పాటు చేయుట, పాఠశాల భవనాలకు కలర్స్ వేయడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్ నిర్మించడం వంటి మౌలిక సౌకర్యాలు, వసతులను కల్పించడం వంటి పనులు చేపడతారని వివరించారు.
మన బడి-మన బస్తి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్ధులకు మరింత నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనేక మంది తల్లిదండ్రులకు తమ పిల్లలను మంచి విద్యావంతులను చేయాలని ఆశయం ఉన్నప్పటికీ వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో రానున్న రోజులలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్ధుల సంఖ్య రెట్టింపు కానున్నదని మంత్రి తలసాని ఆశాభావం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ