ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో విధులు నిర్వహించేలా రిపోర్ట్ చేయడం, అలాగే సంబంధిత అంశంపై సీఎంతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ముందుగా డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలు మేరకు సోమేశ్ కుమార్ ఈరోజు(జనవరి 12, గురువారం) ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. గురువారం ఉదయం విజయవాడకు చేరుకున్న సోమేశ్ కుమార్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డిని కలిసి రిపోర్టింగ్ కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ తో సమావేశమై చర్చించారు.
కాగా ఆంధ్రప్రదేశ్ లో తనకు అప్పగించిన బాధ్యతల్లో సోమేశ్ కుమార్ కొనసాగనున్నట్టు తెలుస్తుంది. గురువారం గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీ సీఎస్ కు జాయినింగ్ రిపోర్టర్ ఇవ్వడానికి వచ్చానని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీకి వచ్చానని, ఏ బాధ్యతలు ఇచ్చినా పని చేయడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా డీవోపీటీ ఆదేశాలు పాటిస్తానని, హోదాతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా వెళ్లనున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ, ఆ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) విధులు నిర్వర్తిస్తున్న సోమేశ్ కుమార్ ను రిలీవ్ చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) జనవరి 10న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. అయితే కేంద్రం నిర్ణయంపై సోమేశ్ కుమార్ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించగా, కేంద్రం నిర్ణయాన్ని క్యాట్ నిలిపివేసి తెలంగాణలోనే కొనసాగేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం క్యాట్ ఉత్తర్వులతో సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగారు. దీంతో క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని కోరుతూ 2017వ సంవత్సరంలో కేంద్రం హైకోర్టులో అప్పీల్ చేసింది.
ఈ క్రమంలో ఆ అంశంపై విచారణ జరగగా, జనవరి 10న తెలంగాణ హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తుది తీర్పు వెల్లడించింది. తెలంగాణకు సోమేశ్ కుమార్ కేడర్ కేటాయింపుని రద్దు చేయడంతో పాటు ఆయన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే సోమేశ్ కుమార్ ను రిలీవ్ చేస్తూ, రిలీవ్ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019, డిసెంబర్ నుంచి 2023, జనవరి వరకు తెలంగాణ సీఎస్గా సోమేశ్ కుమార్ పనిచేశారు. ఆయన 2023 డిసెంబర్ లో సర్వీస్ నుంచి పదవీ విరమణ చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE