కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’ చివరి దశకు చేరుకుంటోంది. ఈ నెల 30వ తేదీన శ్రీనగర్లో జోడో యాత్ర ముగియనుంది. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర దాదాపు 3,500 కి.మీ దూరం కొనసాగి జనవరి 30న శ్రీనగర్లో రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేయడంతో ముగుస్తుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాల మీదుగా ఇప్పటి వరకు 3,300 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర సాగింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తొలిసారి ఇంత సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ యాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.
ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో భావసారూప్యత కలిగిన 21 ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించారు. ఈ మేరకు జనవరి 30న శ్రీనగర్లో జరిగే భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆయా పార్టీల అధ్యక్షులకు లేఖలు రాశారు. ఇక ఖర్గే తన లేఖలో.. ‘ఈ కార్యక్రమంలో, ద్వేషం మరియు హింసకు వ్యతిరేకంగా పోరాడటానికి, సత్యం, కరుణ మరియు అహింస సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మరియు అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం మరియు న్యాయం యొక్క రాజ్యాంగ విలువలను రక్షించడానికి మేము కట్టుబడి ఉంటాము. మన దేశానికి సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో, ప్రజల దృష్టిని ప్రజల సమస్యల నుండి క్రమపద్ధతిలో మళ్లిస్తున్నప్పుడు, యాత్ర ఒక శక్తివంతమైన వాయిస్గా ఉద్భవించింది. మీరు పాల్గొని దాని సందేశాన్ని మరింత బలపరుస్తారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE