మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన చివరి T20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్పై 17 పరుగుల తేడాతో అద్భుత విజయం సొంతం చేసుకుంది. దీంతో సిరీస్ను క్లీన్స్వీప్ చేసినట్లయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ చెలరేగి ఆడటంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. టీమిండియా ఈ మ్యాచ్ లో కొన్ని ప్రయోగాలు చేసింది. ఓపెనర్ ఇషాన్ (34) కు జతగా రుతురాజ్గైక్వాడ్ను పంపింది. కానీ, రుతురాజ్ (4) నిరాశపరిచాడు. తర్వాత శ్రేయాస్ అయ్యర్ (25), రోహిత్ (7) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అయితే, మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లతో 65), వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 నాటౌట్) విజృంభించి ఆడటంతో భారత్ జట్టు భారీ స్కోరు సాధించింది.
ఆ తర్వాత ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. పొలార్డ్ (5), హోల్డర్ (2) నిరాశపరిచారు. చేజ్ (12), పావెల్ (25), షెఫర్డ్ (29) ధాటిగా ఆడే క్రమంలో త్వరగా ఔటయ్యారు. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ తన చక్కటి ఫామ్ను కొనసాగించి వరుసగా మూడో అర్ధ సెంచరీ (47 బంతుల్లో 61; 8×4, 1×6) సాధించాడు. హర్షల్ పటేల్ (3/22), వెంకటేష్ అయ్యర్ (2.1 ఓవర్లలో 2/23), శార్దూల్ ఠాకూర్ (2/33) రాణించారు. సూర్యకుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్నూ గెలుచుకున్నాడు. కాగా, విండీస్తో జరిగిన చివరి నాలుగు టీ20 సిరీస్ల్లో టీమిండియా విజయం సాధించటం విశేషం. అలాగే, భారత్కు వరుసగా తొమ్మిది టీ20ల్లో విజయం సాధించిన కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ