మాజీ కేంద్ర మంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత శరద్ యాదవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఢిల్లీలోని తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను గురుగ్రామ్లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన నాడి కొట్టుకోవడం లేదని, అత్యవసర చికిత్స చేసినప్పటికీ ఫలితం లేదని తెలిపారు. ఈ మేరకు ఫోర్టిస్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రకటన చేసింది. శరద్ యాదవ్ అపస్మారక స్థితిలో మరియు స్పందించని స్థితిలో ఎమర్జెన్సీ వార్డుకు తీసుకురాబడ్డారని, పరీక్షలో అతని పల్స్ అందలేదని, ప్రోటోకాల్స్ ప్రకారం సీపీఆర్ కూడా చేశామని చెప్పారు. అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన శరీరం సహకరించలేదని వెల్లడించారు. దీంతో రాత్రి 10.19 గంటలకు ఆయన మరణించినట్లు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
కాగా 75 ఏళ్ల శరద్ యాదవ్ దేశంలోని ప్రముఖ సోషలిస్టు నేతల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. ఆయన రికార్డు స్థాయిలో 7సార్లు లోక్సభకు మరో మూడు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. కేంద్రంలోని వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. శరద్ యాదవ్ 1999-2004 మధ్య అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో పలు శాఖలను నిర్వహించారు. 2003లో జేడీ(యూ) ఆవిర్భవించాక జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి 2016 వరకూ ఆయన ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ పార్టీకి చెందిన వారే. అయితే 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఓటమి తర్వాత నితీశ్ కుమార్తో సంబంధాలు చెడిపోయిన తర్వాత లోక్తాంత్రిక్ జనతాదళ్ పేరిట సొంత పార్టీ పెట్టారు. అయితే 2012లో తన పార్టీ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీలో విలీనమవుతున్నట్లు శరద్ యాదవ్ ప్రకటించారు. ఇక శరద్ యాదవ్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE