ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా స్పందించారు. నాడు జైల్లో ఉన్నంత మాత్రాన శ్రీ కృష్ణుడి బలం తగ్గలేదని, అలాగే వనవాసం చేసినంత మాత్రాన శ్రీ రాముడి గొప్పతనం తగ్గలేదని, ధర్మం ఎటువైపు ఉంటే చివరికి విజయం అటువైపు ఉంటుందని కవిత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రిజర్వేషన్పై ఈనెల 10న ఆందోళనకు పిలుపు ఇస్తే ఈడీ తమకు నోటీసులు ఇచ్చిందని, 9న విచారణకు రావాలని కోరిందని, 11న విచారణకు వస్తానని ఈడీకి సమాచారం ఇచ్చానని కవిత తెలిపారు. ఇక తెలంగాణ నేతలను వేధించడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు అలవాటుగా మారిందని, ప్రధాని మోదీకి భయపడేది లేదని, విచారణను ఎదుర్కొంటానని, ఈడీకి వంద శాతం సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు.
కాగా తొలుత తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని, అది సాధ్యం కాకపోవడంతో తనను టార్గెట్ చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మద్యం కుంభకోణం దర్యాప్తుపై అంత తొందర ఎందుకు? అని ప్రశ్నించిన ఆమె, రెండు రోజుల సమయమైనా ఇవ్వరా అని నిలదీశారు. అయితే వాస్తవానికి మహిళల విచారణ వారికి అనుకూలంగా ఉన్నచోట చేయాలని కోర్టు తీర్పులు ఉన్నాయని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణ జరిపే అవకాశం ఉందని తెలిపారు. కానీ ఎలాంటి వెసులుబాటు ఇవ్వకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీస్ పంపించారని, కావాలంటే నిందితులను ఇంటికి తీసుకురావాలని ఈడీని కోరానని కూడా కవిత మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని, అందుకే ఇదంతా చేస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు.
గత 9 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను బీజేపీ సర్కార్ కూల్చివేసిందని, తెలంగాణలో కూడా అలాంటి ప్రయత్నమే చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెల్లడించారు. అయితే సీఎం కేసీఆర్ ముందు వారి పప్పులుడకలేదని, దీంతో ఇలా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమకు సహకరిస్తున్నందువల్లే ఈడీ డైరెక్టర్, సెబీ డైరెక్టర్ లను పదవీకాలం అయ్యాక కూడా కొనసాగిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014కు ముందు మన్మోహన్ సింగ్ సర్కార్ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని, ఆమె ధైర్యానికి సెల్యూట్ అని కవిత పేర్కొన్నారు. అయితే సోనియా చొరవతో మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో పాసైనా ఆ తర్వాత ముందుకు కదల్లేదని, యూపీఏ హయాంలో సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి బిల్లు పాస్ కాలేదని భావించామని అన్నారు.
అనంతరం 2014లో, 2019 ఎన్నికల ప్రచారంంలో కూడా బీజేపీ ఎన్నికల హామీల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పాస్ చేస్తామని చెప్పారని, అయితే ప్రజలు రెండు సార్లు మంచి మెజారిటీతో గెలిచినా సరే ఇప్పటివరకు బిల్లు తీసుకురాలేదని కవిత గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో సొంతంగానే బలం ఉందని, ఇతర మిత్ర పక్షాలపై కూడా ఆధారపడనవసరం లేదని తెలిపారు. ఆధార్ వంటి కొన్ని బిల్లులను పాస్ చేయడానికి మనీ బిల్ అని చెప్పి పాస్ చేశారని, కానీ మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రం ముందుకు తేవట్లేదని మణిపడ్డారు. అందుకే తాము ఈ బిల్లు కోసం పోరాటం మొదలుపెట్టామని, రేపు ఉదయం గం. 10.00కి వామపక్ష అగ్రనేత సీతారాం ఏచూరి, ప్రియాంక చతుర్వేది తదితరుల సమక్షంలో ఈ దీక్ష చేపడుతున్నామని వెల్లడించారు. ఇక తన దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కూడా పాల్గొంటాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE