తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి కరోనా చికిత్స కోసం వచ్చే వారికీ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ముందస్తు అనుమతి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ జారీ చేసిన ప్రయాణ అనుమతి పత్రం ఉంటేనే సరిహద్దుల వద్ద పోలీసులు అనుమతి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి హైదరాబాద్కు వస్తున్న అంబులెన్స్ లను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారని విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి వెంకట కృష్ణారావు తెలంగాణ హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్ల నిలిపివేతపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలపై స్టే విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే సరిహద్దుల్లో అంబులెన్స్ లు నియంత్రించడంపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని, మరోవిధంగా కూడా అంబులెన్స్లను అడ్డుకునేందుకు ప్రయత్నించవద్దని కోర్టు సూచించింది. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో చేరేందుకు పేషంట్లకు కంట్రోల్రూమ్ అనుమతి అక్కర్లేదని, ఒకవేళ ప్రజలు కోరుకుంటే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయవచ్చని తెలిపింది. ప్రజలకు కంట్రోల్ రూమ్ సహకరించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఇక ఈ అంశంపై రెండు వారాలలోగా కౌంటర్లు దాఖలు చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్లు అడ్డుకోవడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ అధికారులతో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడారు. అనంతరం ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ