ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ అభ్యర్థులగా పెనుమత్స సూర్యనారాయణ, పోతుల సునీత, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయిల్, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి ఏసు రత్నం, మర్రి రాజశేఖర్ లను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 6న నోటిఫికేషన్ విడుదల కాగా, మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పెనుమత్స సూర్యనారాయణ, పోతుల సునీత, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయిల్, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి ఏసు రత్నం, మర్రి రాజశేఖర్ లు సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా వారంతా సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా బీఫాంలు అందుకున్నారు. ఎమ్మెల్సీలుగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు వారంతా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ కార్యాలయంలో ఏడుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్స్ దాఖలు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, పలువురు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు.
ముందుగా ఏపీలో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎంపికైన నారా లోకేష్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, వరాహ వెంకట సూర్యనారాయణరాజు పెన్మెత్స, గంగుల ప్రభాకరరెడ్డిల యొక్క ఎమ్మెల్సీ పదవీకాలం 2023, మార్చి 29తో పూర్తి కానుంది. అలాగే చల్లా భగీరథరెడ్డి మృతితో ఖాళీ అయిన (2022, నవంబర్ 2) ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 23వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఈసీ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE