అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్, కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో మీట్ అండ్ గ్రీట్ విత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన “మన ఊరు మన బడి” పథకంపై ఎన్ఆర్ఐలతో ముఖాముఖి నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం తీసుకురావడానికి గల కారణాలను కేటీఆర్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకూ కార్యరూపమే ఈ పథకమని ఆయన పేర్కొన్నారు. విద్యతోనే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ఆ విద్యను ప్రతి ఒక్కరికి సమానంగా అందించటం ప్రభుత్వాల బాధ్యత అని మంత్రి అన్నారు. మన తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని, మీకు చేతనైనంతలో మీరు ఈ యజ్ఞంలో పాలు పంచుకోవాలని కోరారు. మనం పుట్టిన గడ్డ కోసం, అక్కడి జనం కోసం ఏదైనా చేయాలన్న తపన ఉన్నవారు వివిధ సామజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆకాంక్షించారు. గుడులు, బడులు, లైబ్రరీలు ఇలా ఎన్నో విధాలుగా మనం పుట్టిన గడ్డకు సేవ చేయటానికి మార్గాలు ఉన్నాయని చెప్పారు.
మన తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో కేవలం మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 33 మెడికల్ కాలేజీలకు ఆ సంఖ్య చేరుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ విద్యాయజ్ఞంలో రూ. 7,230 కోట్ల తో తెలంగాణలోని 26 వేల పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని కేటీఆర్ తెలిపారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం లేదా తాతల పేర్లు నిలబెట్టటంకోసం మీరు ఏదైనా చేయాలనుకుంటే.. ఈ బృహత్కర కార్యక్రమంలో పాల్గొనొచ్చు అని వారికి కేటీఆర్ సూచించారు. దీనికోసం మీకు ఇష్టమున్న పాఠశాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నామని ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలకు మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ