ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణకు పూర్తిస్థాయిలో చేపట్టాల్సిన మరిన్ని చర్యల కోసం మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీకి కన్వీనర్గా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సభ్యులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, సుచరిత, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లను నియమించారు. కరోనా వ్యాప్తిపై తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలుపై చర్చించడంతో పాటుగా ప్రతి రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి చర్యలపై చర్చించేందుకు మార్చ్ 28 , శనివారం నాడు విజయవాడ ఆర్అండ్బి కార్యాలయంలో మంత్రుల ప్రత్యేక కమిటీ సమావేశమైంది. మంత్రులు ఆళ్లనాని, బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, సుచరిత, కురసాల కన్నబాబుతో పాటుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, అదనపు సీఎస్ పీవీ రమేష్, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా వివిధ దశల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.