తమ రెండు పార్టీలు మిత్రపక్షాలే.. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తాము కలిసే వెళ్తాం అంటూ జనసేనపై బీజేపీ నేతలు పదేపదే చెబుతుంటారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందనే చెప్పుకొస్తున్నారు. తాజాగా భారతీయ జనతాపార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. దగ్గుపాటి పురంధేశ్వరి కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కానీ ఎక్కడా కూడా ఈ రెండు పార్టీల అధినేతలు కలిసింది మాత్రం లేదు. అంతకుముందు సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జనసేనతో గ్యాప్ ఎవరూ పూడ్చలేనంతగా ఉండేది. కేంద్ర పెద్దలు జనసేనానికి పెద్ద పీట వేస్తున్నా.. ఏపీలో మాత్రం ఎక్కడా రెండు పార్టీలు కలిసి ఉద్యమాలు చేసిన దాఖలాలు కనిపించేవి కావు.
ప్రస్తుతం రెండు పార్టీల అధ్యక్షులు కలవకపోయినా సరే.. కొన్ని విషయాల్లో మాత్రం పార్టీ క్యాడర్తో కలిసి పని చేయాలని నిర్ణయానికి వచ్చాయి. అయితే మొదటి నుంచీ జనసేన బీజేపీని లైట్ తీసుకున్నా.. మిత్రపక్షం ప్రస్తావనను బీజేపీ నేతలే తీసుకొచ్చేవారు. కానీ అనూహ్యంగా ఈమధ్య స్థానిక సంస్థల నిధులు మళ్లింపు, సర్పంచ్ల సమస్యలపై ప్రభుత్వ తీరుపై బీజేపీ, జనసేన పార్టీలు ఆందోళనలు నిర్వహించాయి. జిల్లా కేంద్రాల వద్ద జరిగిన ధర్నాల్లో బీజేపీ నాయకులతో కలిసి జనసేన కార్యకర్తలు కూడా పాల్గొనడం మీడియా కూడా ఆశ్చర్యపోయేలా చేసింది.
మూడేళ్లుగా ఒక్కసారీ కూడా కలిసి పోరాటాలు చేయని రెండు పార్టీలు.. మొదటిసారి ఒకే వేదికపై ఆందోళనకు దిగాయి. ఇదే ఊపుతో జనసేతో కలిసి ఉద్యమాలు చేయాలని విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు పురంధేశ్వరి. ఇకపై బీజేపీ, జనసేన కలిసి ఉద్యమాలు చేసేలా పురంధేశ్వరి కేడర్కు పిలుపునిచ్చారు. అలాగే ఎవరికి వారు సొంతంగా బలపడాల్సిన అవసరం ఉంది కాబట్టి.. ఇదే సమయంలో వివిధ అంశాల వారీగా కలిసి ఉద్యమాలు కూడా చేయాలని పురంధేశ్వరి సూచించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరి దారి వారిదే అన్న అనుమానాలు తలెత్తుతున్న వేళ ఏపీలో బీజేపీ, జనసేన కలిసి నడుస్తాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు విడుదల చేసిన నిధులను..ఏపీ గవర్నమెంట్ పక్కదారి పట్టించిందంటూ బీజేపీ పదేపదే ఆరోపణలు చేస్తూ వస్తోంది. సర్పంచ్ల సంఘం నేతలు కూడా పురంధేశ్వరిని కలిసి తమగోడును వెల్లబోసుకున్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కూడా కలిసిన సర్పంచుల సంఘం నేతలు తమ సమస్యలు చెప్పుకొన్నారు. దీంతో ఈ సమస్యపై రెండు పార్టీలు కలిసి.. ఆందోళనకు పిలుపు నిచ్చి ఒకటిగా నిలిచాయి. దీంతో ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొన్ని అంశాలపై పోరాటాలు చేయాలని పురంధేశ్వరి సూచించారు.
జనసేనానితో పాటు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఇప్పుడు కొన్ని కామన్ సమస్యలను ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు. రాష్ట్రం చేసిన అప్పులు, కరెంట్ చార్జీల పెంపు, వాలంటీర్ల వ్యవస్థ, ఓట్ల తొలగింపు వంటి అంశాలను రెండు పార్టీల అధినేతలు ప్రభుత్వాన్ని పదేపదే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని.. బీజేపీ,జనసేన ముందుకెళ్తుండటంతో ఇప్పటి వరకూ అక్కడక్కడా ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE