ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. కీలక నేతల నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై ఆసక్తి పెరుగుతోంది, సర్వే సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడి పోయిన టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి వచ్చే ఎన్నికల్లో అక్కడే నుంచే పోటీకి సిద్దం అవుతున్నారు. దీంతో మంగళగిరిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది..? ఎవరు గెలుస్తారు..? అనే లెక్కలతో తాజాగా పొలిటికల్ క్రిటిక్ సర్వే సంస్థ ఆసక్తికర అంచనాలను వెల్లడించింది.
నారా లోకేశ్కు ఈసారి ఎన్నికల్లో గెలుపు కీలకం. పార్టీని గెలిపించుకొనేందుకు యువగళం యాత్ర ద్వారా ప్రజల్లో ఉన్న లోకేశ్, ఈ సారి ఎన్నికల్లో గెలిచి విమర్శలకు సమాధానం చెప్పాలని భావిస్తున్నారు. 2019 లో ఓటమి తరువాత తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేయాలని నిర్ణయించిన లోకేశ్, చాలా రోజులుగా అక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
అమరావతి రాజధాని అంశం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు నారా లోకేశ్. దీంతోనే ప్రతీ గ్రామంలోనూ పర్యటిస్తూ.. పెళ్లికానుక, ఆరోగ్య సేవల ద్వారా ఓటర్లకు దగ్గరయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు వైసీపీ సైతం స్థానిక సామాజిక సమీకరణాలకు అనుగుణంగా పావులు కదిపింది. గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకొని రాష్ట్ర స్థాయి పదవి కేటాయించింది. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావును ఎమ్మెల్సీని చేసింది.
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,337 ఓట్ల మెజార్టీతో నారా లోకేశ్పై విజయం సాధించారు. దీంతో తాజాగా పొలిటికల్ క్రిటిక్ చేసిన సర్వే అంచనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మంగళగిరిలో అర్బన్ ఓటర్లు 1,47,904 ఉండగా, రూరల్ ఓటర్లు 1,20,525 మంది ఉన్నారు. అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 44.15 శాతం, టీడీపీకి 44.99 శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థ అంచనా వేసింది. ఎన్డీఏకు 04.85 శాతం, సీపీఐకు 03.17 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ద్వారా టీడీపీకి స్వల్ప మెజార్టీ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, టీడీపీ నుంచి నారా లోకేశ్, వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీలో ఉంటే వచ్చే ఫలితాలుగా వీటిని స్పష్టం చేసింది.
మంగళగిరిలో మొత్తం 278 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 61,470 ఎస్సీ ఓటర్లు, 8,778 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ టీడీపీ, వైసీపీ హోరా హోరీగా చెరి సగం ఓట్లు దక్కించుకొనే అవకాశం ఉందని విశ్లేషించింది. ఇదే సమయంలో ఎన్డీఏకు వచ్చే ఓటింగ్ శాతాన్ని ప్రత్యేకంగా పేర్కొంది. ఇక్కడ అంచనాల మేరకు హోరా హోరీ పోరు సాగితే సీపీఐ దక్కించుకొనే ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉందని సర్వే లెక్కల ప్రకారం స్పష్టం అవుతోంది. 2019 ఎన్నికల్లో సీపీఐకి 10,135 ఓట్లు రాగా, ఆర్కేకు దక్కిన మెజార్టీ 5,337 ఓట్లు. అయితే, వైసీపీ నుంచి ఆర్కే కాకుండా, బీసీ అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే ఈ లెక్కలు మారటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఈ సంస్థ మంగళగిరి నియోజకవర్గంపై వెల్లడించిన ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని పెంచుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE