ఆల్కహాల్ లవర్స్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. తాజాగా ఏపీలో అందుబాటులో ఉన్న దాదాపు 11 మద్యం తయారీ కంపెనీలు తమ బేసిక్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో కొన్ని బ్రాండ్లపై క్వార్టర్కు 30 రూపాయల వరకు రేటు తగ్గనుందన్న వార్తతో మందుబాబులు ఖుషీ అవుతున్నారు.
తాము అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యాన్ని అది కూడా తక్కువ ధరకు, అందుబాటులోకి తెస్తామని కూటమి పార్టీ హామి ఇచ్చింది. దీని ప్రకారమే సీఎంగా చంద్రబాబు ఛార్జ్ తీసుకున్నతర్వాత.. ఆ దిశగానే తీవ్ర కసరత్తు చేసి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినా కూడా.. ధరలు మాత్రం పెద్దగా తగ్గలేదని ఏపీలో ఆల్కహాల్ లవర్స్ చెబుతూ వచ్చారు.
దీంతో వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ప్రభుత్వం చర్చలు తర్వాత దాదాపు 11 మద్యం తయారీ కంపెనీలు తమ బేసిక్ ధరలను తగ్గించేశాయి. దీంతో ఆయా కంపెనీల నుంచి ఏపీ బెవరేజస్ సంస్థ లిక్కర్ కొనే రేటు తగ్గుతుంది.దీనివల్ల వివిధ బ్రాండ్ల మద్యం ఒక్కో క్వార్టర్ ధర ఎంఆర్పీ పైన 30 రూపాయల ధర వరకూ తగ్గుతోందన్న వార్తతో.. మద్యం ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు లిక్కర్ రేట్స్ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా సరే ఎంఆర్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా కూడా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అలాగే బెల్ట్ షాపులకు మద్యాన్ని అమ్మితే.. ఆ షాపులకు మొదటి తప్పు కింద 5 లక్షలు రూపాయల ఫైన్ వేయనున్నట్లు తెలిపారు. అంతేకాదు రెండోసారి కనుక అదే తప్పు రిపీట్ చేస్తే మాత్రం ఆ షాపు లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందని హెచ్చరించారు.
ప్రతి షాపు దగ్గర కూడా తప్పనిసరిగా మద్యం ధరల పట్టిక బోర్డులు ఉండాలని ఏపీ సీఎం సూచించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలతో పాటూ.. టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.ఇటు షాపుల ఓనర్ల దగ్గర ఎవరైనా సరే కమిషన్స్ కోసం ఒత్తిడి చేస్తే తాను ఊరుకోనని పార్టీ లీడర్లకు క్లియర్ కట్గా చెప్పేశారు ముఖ్యమంత్రి.