ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సోమవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించి పన్నుల వసూళ్లలో పారదర్శకత, పన్నుల విభాగంలో నాణ్యమైన సేవలకు ఉద్దేశించిన పలు నిర్ణయాల అమలుపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పన్నుల విభాగంలో డేటా అనలిటిక్స్ సెంటర్ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించగా, మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా, ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా మంచి విధానాలను రూపొందించుకోవాలన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని సీఎం అన్నారు.
ఎక్సైజ్ శాఖపై సమీక్ష సందర్భంగా అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. బెల్టుషాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలకపాత్ర అని, దీనిపై గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుకు సంబంధించి ఒక ఎస్ఓపీ రూపొందించాలని, అక్రమ మద్యం తయారీ, అమ్మకాలకు సంబంధించి క్రమం తప్పకుండా వారి నుంచి నివేదికలు తీసుకోవాలని చెప్పారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై సమీక్ష సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్న అధికారులు తెలుపగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయం, ఎమ్మార్వో, ఎండీఓ, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత ఫోకస్ పెట్టాలని సీఎం ఆదేశించారు. 14400 ఏసీబీ నెంబరుతో పోస్టర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్పష్టంగా కనిపించేలా ఈ నెంబరుపోస్టర్ను డిస్ప్లే చేయాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ నెంబరు డిస్ప్లే చేయాలని, 14400 ఫోన్ కాల్స్ను రిసీవ్ చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్టుపై కూడా పక్కాగా ఉండాలని చెప్పారు.
గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏయే సేవలు అందుబాటులో ఉంటాయన్నది పోస్టర్ల రూపంలో డిస్ప్లే చేయాలని సీఎం చెప్పారు. 51 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయని, మరో 650 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు వివరించారు. వీటికి అదనంగా 2వేల గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కోసం అక్టోబరు2, 2022 నాటికి ఏర్పాట్లు సిద్ధం చేస్తామన్నారు. అటవీ పర్యావరణ శాఖ, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపైనా కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ సమీక్షా సమావేశానికి ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ సహా పలు శాఖల ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY