విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆనస్థీషియా (మత్తు) వైద్య నిపుణుడు డాక్టర్ కె.సుధాకర్ రెండ్రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా బాధితులకు చికిత్స అందించే డాక్టర్ల బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఒక మాస్క్ ను 15 రోజుల పాటు వాడుకోమంటున్నారని, ఈ సమయంలో డాక్టర్లకు రక్షణ లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ విమర్శలు వైద్య శాఖలో సంచలనం కలిగించడమే కాకుండా, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో ఈ ఆరోపణలపై ఏప్రిల్ 7, మంగళవారం నాడు జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
విచారణ అనంతరం, డాక్టర్ సుధాకర్ బాధ్యతారహితంగా ప్రవర్తించి, క్రమశిక్షణ లేకుండా అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడినందున ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా వైద్య విధాన పరిషత్తు (డీసీహెచ్ఎస్) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నర్సీపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డాక్టర్ సుధాకర్పై స్థానిక పోలీస్ స్టేషన్ లో నాలుగు సెక్షన్లతో కూడిన కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. వాస్తవాలు బయటకు చెప్పినందుకు దళితుడినైన తనను సస్పెండ్ చేశారని డాక్టర్ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమే ఈ డాక్టర్ తో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయించి నాటకాలు ఆడుతుందని అధికార వైసీపీ పార్టీ సభ్యులు విమర్శిస్తున్నారు.
[subscribe]