ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 8, బుధవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348 కి చేరుకుంది. ఇక బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఈరోజు గురువారం ఉదయం 9 గంటల వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 217 సాంపిల్స్ ను పరీక్షించగా, అన్నికేసులు నెగటివ్ గా నిర్దారించబడ్డాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటుగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాలంటీర్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం.గిరిజాశంకర్ బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
కోవిడ్-19 వాలంటీర్ల నియామక ప్రకటన వివరాలు:
- వివిధ ఆస్పత్రుల్లో అదనంగా అవసరమయ్యే వైద్య నిపుణులు, పారా మెడికల్ సిబ్బందిని సమకూర్చేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో కోవిడ్ వారియర్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం.
- రాష్ట్రంలో 13 జిల్లాల్లో గల 271 మెడికల్ కళాశాలలు, డెంటల్, యునాని, ఆయుర్వేద, నర్సింగ్ కళాశాలలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్-19 వాలంటీర్లుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కల్గిన నర్సులు, పారా మెడికల్ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్-19 వారియర్స్గా పని చేసేందుకు ముందుకు రావాలి. వీరి సేవలను ఆస్పత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లలో వినియోగించుకుంటాం.
- వాలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటాం. ఆసక్తి ఉన్నవారు health.ap.gov. in/CVPASSAPP/Covid/ Volunteerjobs వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలి.
- ప్రస్తుతం వాలంటీర్లుగా పనిచేసేందుకు ముందుకువచ్చినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్మెంట్లలో ప్రాధాన్యం ఇస్తాం.