మారుతున్న కాలానికి అనుగుణంగా క్రికెట్ ఆటలో మరింత మజా పెంచేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వినూత్న నిర్ణయం తీసుకుంది. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అనే పేరుతో క్రికెట్ చరిత్రలో తొలిసారిగా సరికొత్త నిబంధనను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా అక్టోబర్ 11, 2022 నుండి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు బీసీసీఐ అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు సర్క్యులర్ జారీ చేసింది. అందులో ఈ నిబంధనకు సంబంధించిన సమాచారం అందించబడింది. క్రికెట్ను మరింత ఆసక్తికరంగా మార్చడానికి ఈ కొత్త నియమాన్ని ప్రవేశపెడుతునట్లు అందులో బీసీసీఐ వెల్లడించింది.
ఇక ఈ నిబంధన విజయవంతమైతే మున్ముందు ఐపీఎల్లో కూడా దీనిని ప్రవేశపెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే సాధారణంగా ఇలాంటి రూల్ను ఫుట్బాల్, రగ్బీ తరహా ఆటల్లో చూస్తుంటాము. కాగా నియమం ప్రకారం, ప్రతి మ్యాచ్లో, రెండు జట్ల కెప్టెన్లు మ్యాచ్కు 11 మందికి బదులుగా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. అలాగే, ఇరు జట్లు వ్యూహాత్మకంగా ఆట సమయంలో అవసరమనుకుంటే తమ జట్టులోని 11మందిలో ఒక ప్లేయర్ని భర్తీ చేయవచ్చు. ఆస్ట్రేలియాలో బిగ్ బాష్లో ఇప్పటికే ‘ఎక్స్ ఫాక్టర్’ పేరుతో ఇటువంటి నియమం ఉంది. దీని ప్రకారం, కోచ్ మరియు కెప్టెన్ భావిస్తే.. తమ మొదటి ఇన్నింగ్స్లో 14వ ఓవర్కు ముందు ఏదైనా ఒక ఆటగాడిని మారుస్తారు.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనలు..
- మ్యాచ్ ప్రారంభానికి ముందే టాస్ సమయంలోనే ఆయా జట్లు తమ తుది జట్టుతో పాటు మరో నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్ల పేర్లను జాబితాలో తెలపాలి.
- ఇక మ్యాచ్ మధ్యలో ప్రతి జట్టు తమ ఇన్నింగ్స్ 14వ ఓవర్ లోపుగా ఒక ప్లేయర్ను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
- 15 నుంచి 20 ఓవర్ల మధ్య ఇంపాక్ట్ ప్లేయర్కు గ్రౌండ్ లోకి అనుమతి లేదు.
- అయితే ఒకసారి ఈ నియమం కింద బయటకు వెళ్లిన ప్లేయర్ మళ్లీ బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ చేసేందుకు మళ్లీ అవకాశం ఉండదు.
- అదే ఇంపాక్ట్ ప్లేయర్ మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది.
- అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ను తీసుకోవాలని భావించినప్పుడు ఆ విషయాన్ని కెప్టెన్ ఫీల్డ్ అంపైర్ లేదా ఫోర్త్ అంపైర్లకు తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY