ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రిజర్వేషన్ల కోసం.. నిబంధనలను నిర్వీర్యం చేయబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అందుకోసం సరికొత్త ప్రమాణాలను నిర్దేశించలేమని పేర్కొంది. జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్. గవాయిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ జరిగిన విచారణలో స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్ల మంజూరుపై తీర్పును సుప్రీంకోర్టు అక్టోబరు 26న రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. 133 పిటిషన్లపై వాదనలను విన్న తర్వాత శుక్రవారం ఈ తీర్పును ఇచ్చింది.
రిజర్వేషన్ల కల్పన కోసం రాష్ట్రాలు సమీక్షను నిర్వహించాలని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో రిజర్వేషన్ల మంజూరుకు ముందు గణాంకాలతో కూడిన సమాచారాన్ని సేకరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది. ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగడం కోసం తామేమీ కొత్త ప్రమాణాలను తీసుకురాలేమని, అది చేయాల్సింది వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలని తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను అమలు చేసేముందు కేడర్ వారీగా ఉద్యోగుల ఖాళీల లెక్కలు తీసుకోవాలని పేర్కొంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే విధిగా సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి దాఖలైన 133 వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ