హైదరాబాద్ చెంగిచెర్లలోని ‘నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్’ ను శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి వెంట వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ ఉత్పాదకతను అందుకోవాలని, ఉత్పాదకత పెంచుకుంటేనే మార్కెట్ డిమాండ్ ను తట్టుకొని నిలబడగలుగుతామని అన్నారు. చైనా లాంటి దేశాలలో ఎకరాలో వంద క్వింటాళ్లు పండిస్తే మనం ఎకరాలో 30 క్వింటాళ్లు మాత్రమే పండించ గలుగుతున్నాం. మాంసం అయినా, వ్యవసాయ ఉత్పత్తులు అయినా అంతర్జాతీయ సగటుకు సమానంగా పండించగలిగితేనే అంతర్జాతీయ మార్కెట్ లో పోటీ పడగలుగుతామని అన్నారు.
ఏడాదికి తెలంగాణ సగటు తలసరి మాంసం వినియోగం 23 కేజీలు:
దేశంలో వుండే గొర్రెలు 7-5 కోట్లు అని, అయితే ఒక్క తెలంగాణలోనే 2 కోట్ల గొర్రెలున్నాయన్నారు. ఏడాదికి దేశ సగటు తలసరి మాంసం వినియోగం 6 కేజీలు కాగా, తెలంగాణ సగటు తలసరి వినియోగం 23 కేజీలని చెప్పారు. అంటే రాష్ట్రంలో ఉన్న గొర్లు కాక ప్రతీరోజు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అందువల్ల మన గొర్ల సంఖ్య ఇంకా పెంచుకుంటూ మాంసం దిగుబడి అధికంగా వచ్చే బ్రీడ్స్ ను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఇప్పుడు సగటు గొర్రె మాంసం 13 కేజీలు కాగా, కనీసం 25 కేజీల సగటు సాధిస్తే మన భవిష్యత్ అవసరాలు తీరుతాయని తెలిపారు. స్థానిక భాషలో ఉత్పాదకత పెంపునకు గల అవకాశాల వివరాలను ముద్రించి గొర్రెల, మేకల పెంపకందారులకు అందుబాటులో ఉంచాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని, పరిశోధన కేంద్రం ఏర్పాటుకోసం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.
గొర్రెల పెంపకం, మాంసం ఎగుమతుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలి:
“కంది, జొన్న, మొక్కజొన్న, పప్పుశనగ, ఉలవ, మినుము పంటల నూర్పిడి తర్వాత మిగిలే వ్యర్థాల మిశ్రమాలు గొర్రెల మేతకు ఎంతో ఉపయోగపడతాయి. గొర్రెల పెంపకం, మాంసం ఎగుమతుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలి. భారత్ వంటి దేశంలో ఏ మార్పునైనా స్వీకరించడానికి కొంత ఆలస్యం అవుతుంది. మార్పు మొదలైతే వేగంగా పెను మార్పులకు దారి తీస్తుంది. గొర్రెలు, మేకల పెంపకందారులు సొసైటీలుగా ఏర్పడి ఈ దిశగా మాంసం ఎగుమతులపై దృష్టిసారించాలి. నిజాం ముని మనవడు ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం చేస్తున్నారు. పనిని ఎప్పుడూ నామోషీగా భావించకూడదు. వనపర్తిలో అత్యాధునిక స్లాటర్ హౌజ్, మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకుందాం. దేశంలో ఎక్కువ గొర్రెలు ఉన్న ప్రాంతం తెలంగాణ. తెలంగాణలో ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి పాలమూరులో వనపర్తి ప్రాంతంలో ఎక్కువ గొర్రెలు ఉన్నాయి. వనపర్తి గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలోని 192 సంఘాలు మాంసం ఎగుమతుల మీద దృష్టి సారించాలి” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. ఈ పర్యటన సందర్భంగా మంత్రి మొక్కలు కూడా నాటారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డా.ఎస్.బి.బర్బుద్ధే, ప్రిన్స్ పల్ సైంటిస్ట్ బస్వారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF