హైదరాబాద్లోని ఎన్టీఆర్ పార్క్ సమీపంలో 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణకు అంతే ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. మంగళవారం ప్రగతి భవన్లో మంత్రులు, అధికారులతో జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. కాగా ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక ఇదిలా ఉండగా ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు సమాచారం.
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ చేసిన కొన్ని సూచనలు..
- 125 అడుగుల విగ్రహానికి తగ్గట్టుగా భారీ సభ, హెలికాప్టర్ ద్వారా విగ్రహంపై పూల వర్షం ఏర్పాటు చేయాలి.
- ఏప్రిల్ 14న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది.
- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేడ్కర్ ముని మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ పాల్గొంటారు.
- ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్రెడ్డితో కమిటీ ఏర్పాటు.
- విగ్రహావిష్కరణ క్రతువు నిర్వహించేందుకు బౌద్ధ భిక్షువులను ఆహ్వానించి వారి సంప్రదాయ పద్ధతిలోనే కార్యక్రమాన్ని జరిపించాలి.
- విగ్రహావిష్కరణ సభకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 35,700 మందిని ఆహ్వానించాలి.
- ఇందుకోసం అవసరమైన 750 ఆర్టీసీ బస్సులను ముందుగానే బుక్ చేసుకోవాలి.
- విగ్రహావిషరణ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అంబేడ్కర్ అభిమానులు, సామాజిక వేత్తలు భారీగా విగ్రహ సందర్శన కోసం వస్తారు.
- ఈ సందర్భంగా నివాళులర్పించేందుకు విగ్రహ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలను అందుబాటులో ఉంచాలి.
- సభికుల కోసం 40 వేల కుర్చీలు వేయాలి. అలాగే కార్యక్రమాన్ని అందరూ స్పష్టంగా వీక్షించేలా ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయాలి.
- ఇక వేసవిని దృష్టిలో పెట్టుకుని నీడకోసం టెంట్లు, తాగునీరు, మజ్జిగ వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలి.
- అంబేడ్కర్ విగ్రహాన్ని చూడటానికి కొన్నిరోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రజలు భారీగా రావొచ్చు.
- అందుకే ఈ ఏర్పాట్లన్నీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ తర్వాత ఒక నెలపాటు కొనసాగించాలి.
- ఇక అంబేడ్కర్ విగ్రహ రూపశిల్పి, మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరించాలి.
- గిడ్డంగుల శాఖ చైర్మన్, గాయకుడు సాయిచంద్తో కలిసి సాంసృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ఆకట్టుకునే రీతిలో వివిధ సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించాలి.
- ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అధికారిక కార్యక్రమం కాబట్టి సీఎస్ శాంతి కుమారి ఈ ఏర్పాట్లను పరిశీలించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE