హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19 సాయంత్రానికే ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఉప ఎన్నికల ప్రచారంలో ఈ నెల 17న పాల్గొనబోతున్నారు. తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరుపున ప్రచారం నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 17, గురువారం మధ్యాహ్నం హుజూర్నగర్ లో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ ఉప ఎన్నికలను తెరాస, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించి పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే అక్టోబర్ 4న హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ షోతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లకు పార్టీ నాయకులు సమాయత్తమవుతున్నారు. పార్టీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరపున ఇప్పటికే రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరో మంత్రి జగదీశ్రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అక్కడే ఉండి, పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. బహిరంగ సభ అనంతరం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది.
[subscribe]