మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై వస్తున్న ఆరోపణలు, ఊహాగానాలు నిజం కావని కేసు విచారణ సమర్ధవంతంగా జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేసారు. ఈ కేసుపై పలు రకాల ప్రచారాలు, ఆరోపణలు చేసేవారికి నోటీసులు పంపుతామని చెప్పారు. రాజకీయంగా మాట్లాడే మాటలకు, కేసు విచారణకు తేడా ఉంటుందని, అనవసరంగా మాట్లాడే మాటలు కేసు విచారణను ప్రభావితం చేస్తాయని సవాంగ్ పేర్కొన్నారు. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలను తాము పట్టించుకోమని, పోలీసులు వారి పని వారు చేసుకుంటూ పోతారని చెప్పారు.
అక్టోబర్ 15, మంగళవారం నాడు విజయవాడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. పోలీసులపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలిగిపోవడానికే విజిట్ పోలీస్ స్టేషన్ అనే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామని చెప్పారు. మావోయిస్టులపై స్పందిస్తూ, రాష్ట్రంలో వారి ప్రభావం బాగా తగ్గిందని, ప్రజల్లో సైతం మావోయిస్టుల భావజాలం తగ్గుముఖం పట్టిందన్నారు. మార్పు ప్రజాస్వామ్యం ద్వారానే వస్తుందని, హింస ద్వారా ప్రజాస్వామ్యం రాదని చెప్పారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఏ మావోయిస్టు లేడని డీజీపీ ప్రకటించారు.
[subscribe]