ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన ఖనిజాల ఆధారిత పరిశ్రమల స్థాపన మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేశ్ రష్యా పర్యటనలో భాగంగా పలు కీలక ప్రతిపాదనలు చేశారు. రష్యా రాజధాని మాస్కోలో పర్యటిస్తున్న ఆయన, అక్కడి ప్రముఖ రేర్ఎర్త్ మినరల్స్ సంస్థ ‘గిరెడ్మెట్ ఇన్స్టిట్యూట్’ (Giredmet) ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు ఇతర ఏపీ ప్రతినిధి బృందం పాల్గొన్నారు.
రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గిరెడ్మెట్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులతో మాస్కోలో సమావేశమయ్యాను. విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరులను ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ & రేర్ ఎర్త్ ఎలిమెంట్ (REE) రిఫైనింగ్ హబ్ ను ఏర్పాటుచేసే అవకాశాలను పరిశీలించాలని,… pic.twitter.com/bx844j9WxP
— Lokesh Nara (@naralokesh) June 7, 2026
ఏపీలో రేర్ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్
-
ఉత్తరాంధ్రలో భారీ అవకాశం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో అపారంగా లభించే సహజ ఖనిజ వనరులను ఆధారంగా చేసుకుని, రాష్ట్రంలో ‘డీప్ ప్రాసెసింగ్ మరియు రేర్ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్’ (Deep Processing and Rare Earth Element Refining Hub) ను ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని గిరెడ్మెట్ ప్రతినిధులను మంత్రి కోరారు.
-
నెల్లూరులో మ్యాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం: భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు (EV), పవన విద్యుత్ (Wind Energy) మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ రంగాల అవసరాలను తీర్చేందుకు గిరెడ్మెట్ సంస్థకు చెందిన అధునాతన ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించి, నెల్లూరు జిల్లాలో ఫుల్ సైకిల్ రేర్ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కోసం ‘నియోడైమియం మ్యాగ్నెట్’ (Neodymium Magnet) ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.
-
సెమీకండక్టర్ ల్యాబ్ ఏర్పాటు: భారత్ టెక్ కారిడార్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న ‘ప్లగ్ అండ్ ప్లే’ ప్రయోగశాలలను వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా మెటలర్జీ అల్ట్రా-ప్యూర్ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ల్యాబ్ను ఏపీలో ఏర్పాటు చేయడానికి చొరవ చూపాలని కోరారు. పారిశ్రామిక వ్యర్థాలు, మైనింగ్ టెయిలింగ్స్ నుంచి అరుదైన మరియు విలువైన లోహాలను వెలికితీసేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతను అందించడంలో ఏపీతో చేతులు కలపాలని గిరెడ్మెట్ ప్రతినిధులకు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
మాస్కోలోని అణుశక్తి మ్యూజియం సందర్శన
రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని ప్రపంచ ప్రసిద్ధ అణుశక్తి మ్యూజియం (Atom Pavilion) ను మంత్రి లోకేశ్ సందర్శించారు. 25 వేల చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో, 7 అంతస్తులతో నిర్మితమైన ఈ అతిపెద్ద మ్యూజియంలోని విశేషాలను, శాంతియుత అవసరాల కోసం రష్యా అణుశక్తిని ఎలా వినియోగిస్తుందనే విజయాలను ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. సోవియట్ యూనియన్ అణు ప్రాజెక్టు ప్రారంభ దశల నుంచి ఆధునిక అణుశక్తి రంగం సాధించిన ప్రగతి, భవిష్యత్తులో రాబోయే శాస్త్రీయ అవకాశాలకు సంబంధించిన వివిధ ప్రదర్శనలను మంత్రి ఈ సందర్భంగా తిలకించారు.





































