ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా అన్ని పార్టీలూ ఒక్కటవుతున్నాయి. శత్రువు, మిత్రుడు అని ఎవరూ లేరు. ఇప్పుడు అందరి లక్ష్యం ఒకటే.. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించడమే అన్నట్లుగా మారింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీడీపీ – జనసేన కూటమికి లేఖ రాశారు. అందరూ కలిసి ప్రభుత్వ అవినీతి పాలనపై పోరాడదాం అని పిలుపునిచ్చారు. ఇప్పటికే షర్మిల జగన్ లక్ష్యంగా బాణాలు విసురుతున్నారు. ఇదిలాఉండగానే.. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత అధినేత చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షాతో ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ రాజకీయాల గురించి ఇప్పుడు హస్తినలో కూడా చర్చకు రావడంతో అసలేం జరుగుతోంది అనే దానిపై ఆసక్తి ఏర్పడింది. నిన్న సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు ఎయిర్పోర్ట్లో పార్టీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రఘురామకృష్ణంరాజు స్వాగతం పలికారు. కాసేపు విశ్రాంతి తర్వాత చంద్రబాబు ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి చేరుకున్నారు. అక్కడే పార్టీ ఎంపీలతో సమావేశం జరిపారు. అదే సమయంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అక్కడి రావడం చర్చనీయాంశంగా మారింది.ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
అనంతరం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాత్రి దాదాపు 8 గంటల సమయంలో వారి భేటీ జరుగుతుందనే ప్రచారం జరిగినా, రాత్రి 11.25 గంటల సమయంలో అమిత్షా నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు. సుమారు గంటపాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం నుంచి జేపీ నడ్డా 10 నిముషాల ముందుగానే వెళ్లిపోయారు. వారి భేటీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, త్వరలోనే టీడీపీ – బీజేపీ ఎన్నికల పొత్తులపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.
ఆదరాబాదరాగా అర్ధరాత్రి వరకూ చర్చలు జరిపారంటే.. కీలక అంశాలపైనే అయి ఉంటుందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉండడంతో విపక్ష పార్టీలన్నీ కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి. కలిసికట్టుగా జగన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాయి. తాజాగా అమిత్ షా తో చర్చల నేపథ్యంలో ఎటువంటి ప్రకటన వెలువడనుందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE