ఇంకెప్పుడూ వైసీపీ నేతలతో వేదిక పంచుకోను – టీడీపీ కమిటీ ముందు ఎమ్మెల్యే బొండా ఉమా

TDP MLA Bonda Umamaheswara Rao Reaffirms Loyalty to CM Chandrababu and Party

పాతికేళ్లుగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నానని, ఏనాడూ పార్టీ గీత దాటలేదని, ఇకపై కూడా అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటానని తెదేపా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల గుంటూరులో జరిగిన దివంగత కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడం రాజకీయంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆయన తెదేపా త్రిసభ్య కమిటీ ముందుకు హాజరై తన వివరణ ఇచ్చారు.

పార్టీ ఆదేశాలను ఎప్పుడూ ధిక్కరించను

సీఎం చంద్రబాబు నిర్దేశించిన క్రమశిక్షణను శిరసావహిస్తానని బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అధినేత ఆదేశాలను, పార్టీ సిద్ధాంతాలను ధిక్కరించే ఆలోచన కలలో కూడా చేయనని పేర్కొన్నారు. కాపు నేత సంస్మరణ సభ కావడంతోనే తాను హాజరయ్యానని, అక్కడ అనుకోకుండా జరిగిన ఘటనను కొందరు దుష్టశక్తులు వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ నేతలతో వేదిక పంచుకోను

గుంటూరు సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబు వచ్చి పలకరించడం, పక్కన కూర్చోవడం సమన్వయ లోపం వల్ల జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండే ఏ వేదికలైనా, కార్యకలాపాలైనా వెళ్లేదే లేదని ఖరాఖండీగా చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని కమిటీకి హామీ ఇచ్చారు.

నాపై కుట్ర జరుగుతోంది

2019 నుంచి 2024 వరకు ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పోరాడానని, మాచర్ల, గుడివాడ ఘటనలైనా లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడైనా ముందుండి పోరాటం చేశానని గుర్తుచేశారు. పార్టీలో తన ఎదుగుదలను తట్టుకోలేని కొందరు శక్తులు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నాయని, ఈ అంశంపై సీఎం చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్‌లను కలిసి స్వయంగా వివరణ ఇస్తానని ఆయన వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here