తెలంగాణ విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ చేసిన ఆరోపణలపై టిఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్ స్పందించారు. గురువారం నాడు మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ యూనిట్ సౌర విద్యుత్ ను రూ.4.30 కే కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం రాత్రికి రాత్రే యూనిట్ కు రూ.5.50 ధర ప్రకారం విద్యుత్ కొనుగోలుకు ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసారంటూ లక్ష్మణ్ చేసిన ఆరోపణలను సీఎండీ ప్రభాకర్ ఖండించారు. విద్యుత్ కొనుగోళ్లు, చేస్తున్న సరఫరాపై కొందరు నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి అందరికి తెలుసునని, రాష్ట్రం ఏర్పడిన నాటికీ 7778 మెగావాట్ల ఉత్పత్తి ఉండగా, ఇప్పుడు 16,200 మెగావాట్లకు చేరుకుందని చెప్పారు.
తెలంగాణ ఏర్పడే నాటికీ రాష్ట్రంలో కేవలం 71 మెగావాట్ల సోలార్ పవర్ ఉండేదని, ఇప్పుడు 3600 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే టాప్లో ఉందని చెప్పారు. రాష్ట్రము ఏర్పడిన దగ్గర నుంచి ఒక్క మెగావాట్ విద్యుత్ కూడ ఉత్పత్తి కాలేదని కొందరు అసత్య ప్రచారాలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. విద్యుత్ సంస్థలు స్వతంత్రమైనవని, వారిపై ఎవరి ఒత్తిడిలు లేవని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తూ పారదర్శకంగా పని చేస్తున్నామని, సంస్థ పనితీరుపై ఎవరికైనా అనుమానాలు ఉంటే సీబీఐ విచారణకు సైతం సిద్ధమేనని ప్రకటించారు.
[subscribe]
[youtube_video videoid=fRzddTMdrK8]