వెస్టిండీస్ తో జరుగుతున్న తోలి టెస్టులో రెండో రోజు భారతజట్టు పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 108 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ప్రారంభంలోనే రిషబ్ పంత్ వికెట్ ఇవ్వగా, రవీంద్రజడేజా ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. టెయిలెండర్ల సహాయంతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ 58 పరుగులు చేసాడు. తోలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 297 పరుగులు చేయగా, వెస్టిండీస్ బౌలర్ రౌచ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తరువాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టును, బౌలర్ ఇషాంత్ శర్మ 5 వికెట్లు పడగొట్టి కట్టడి చేసాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలిఇన్నింగ్స్ లో 59 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.
బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టుకు మంచి ఆరంభమే వచ్చింది. బ్రాత్ వైట్ తో కలిసి జాన్ క్యాంప్బెల్ ఇన్నింగ్ మొదలుపెట్టాడు. క్యాంప్బెల్ 23 పరుగులవద్ద షమీ బౌలింగ్ లో అవుట్ అవ్వగా, బ్రాత్ వైట్ సైతం 14 పరుగులకే ఇషాంత్ శర్మ బౌలింగ్ లో వెనుదిరిగాడు. మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో రోస్టన్ చేజ్, డారెన్ బ్రావో తో కలిసి ఇన్నింగ్ చక్కదిద్దాడు. మంచి పోరాటం చేసిన చేజ్ 48 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్ లో రాహుల్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. షై హోప్, హెట్మయిర్ కుదురుకుంటుండగా ఇషాంత్ శర్మ విజృంభించాడు. 54వ ఓవర్లో చివరి బంతికి షై హోప్ వికెట్ పడగొట్టాడు. మళ్ళీ 56వ ఓవర్లో మూడో బంతికి 35 పరుగులు చేసిన హెట్మయిర్ ను, చివరి బంతికి రౌచ్ ని అవుట్ చేసి వెస్టిండీస్ జట్టును కోలుకోకుండా చేసాడు. రెండో రోజు ఆటముగిసే సమయానికి కెప్టెన్ హోల్డర్, బౌలర్ కమ్మిన్స్ క్రీజులో ఉన్నారు.