తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరియు వరదల నేపధ్యంలో వాటిపై తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్లతో ఆగస్టు 15, శనివారం నాడు బిఆర్ కెఆర్ భవన్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇంకా కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగనున్నందున జిల్లా అధికారులందరు హెడ్ క్వాటర్స్ లోనే అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు పరిస్ధితులను పర్యవేక్షించి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.
జిల్లాల్లో రైల్వే లైన్ లకు దగ్గరగా ఉన్న చెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, జిల్లా కలెక్టర్లకు సీఎస్ సూచించారు. చెరువులు మరియు కుంటలకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పూర్తి స్ధాయి నీటి మట్టానికి చేరకముందే చెరువు కట్టలను సంరక్షించడానికి తగు చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్ధితిని పర్యవేక్షించడానికి తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం లను ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. రాష్ట్ర స్ధాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు అయిందని, ఎవరికైనా ఎలాంటి కష్టం ఉన్న (040-23450624) కు కాల్ చేయవచ్చని తెలిపారు. జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సీఎస్ తెలిపారు. అదనంగా గ్రామాలు మరియు పట్టణాల్లో పరిశుభ్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కూడా సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu