తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్ నగరంలోని ఓఆర్ఆర్ వెంబడి సోలార్ రూఫ్ టాప్ తో కూడిన ప్రపంచస్థాయి సైకిల్ ట్రాక్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మొదటి దశలో భాగంగా నానక్రామ్గూడ-టీఎస్పీఏ (8.5 కి.మీ పొడవు) మరియు నార్సింగి-కొల్లూరు (14.5 కి.మీ పొడవు) స్ట్రెచ్లో ఓఆర్ఆర్ వెంబడి 4.5 మీటర్ల వెడల్పుతో 23 కిలోమీటర్ల మేర బై-సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ సైకిల్ ట్రాక్ సోలార్ రూఫ్ టాప్ మరియు సీసీటీవీలతో సహా అత్యాధునిక వసతులతో, అన్ని భద్రతా ఫీచర్లతో 24/7 పని చేయనుంది. మొత్తం 23 కి.మీ మేర సోలార్ రూఫ్ ఏర్పాటుతో 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగనుంది. ఈ సైకిల్ ట్రాక్ ను 2023 వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే కొన్ని ప్రజా ఉపయోగకరమైన నాన్ మోటరైజ్ ట్రాన్స్పోర్ట్ సోల్యూషన్స్ను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ ట్రాక్ కు శంకుస్థాపన చేశామని అన్నారు. ఆరు నెలల కిందట ట్విట్టర్ ఓ మిత్రుడు ట్వీట్ ట్యాగ్ చేస్తూ, సౌత్ కొరియాలో సైక్లింగ్ ట్రాక్ ఉందని, హైవే మధ్యలో సోలార్ షేడ్ ప్యాన్లతో కట్టారు, చూడడానికి బాగుంది, హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. మనదగ్గర ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించడం జరిగిందన్నారు. అందుకు స్పందిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించి అమలుచేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దానికి అనుగుణంగా అధికారులను సౌత్ కొరియాకు వ్యక్తిగతంగా పంపామని, అలాగే దుబాయిలో బాగుందంటే అక్కడికి వెళ్లి ఆ మోడల్ ను కూడా స్టడీ చేశామని చెప్పారు. హైదరాబాద్ కు మణిహారం లాంటి 160 కిమీ ఓఆర్ఆర్ ఉందన్నారు. దాన్ని ఉపయోగించుకోవడంతో పాటుగా విస్తృతమైన పురోగతి, పట్టణీకరణ జరుగుతుందని, దానికి తగ్గట్టుగా స్థానికంగా ఉండే యువ సోదరులు, ఐటీ రంగం, ఇతర రంగాల్లో పనిచేసే వారికి ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్ చేస్తూ వెళ్లి వచ్చే పద్ధతి ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించామని, అలాగే కేవలం ఆఫీస్కి వెళ్లి రావడమే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కోసం సైతం బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
24 గంటల పాటుగా ఈ ట్రాక్ అందుబాటులో ఉండాలి, పిల్లలు, పెద్దలు, అమ్మాయిలు, అబ్బాయిలు సైక్లింగ్ చేసేలా దేశంలో తొలిసారిగా ఇలాంటి సైకిల్ ట్రాక్ కు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. శంకుస్థాపనతో పాటుగా మోడల్ డెమో కింద 50 మీటర్లు ట్రాక్ ను తయారు చేశామన్నారు. జర్మనీ, సౌత్ కొరియా, పారిస్, ఇతర దేశాల్లో ట్రాక్స్ ను అధ్యయనం చేశాక, వాటికీ దీటుగా నాలుగున్నర మీటర్ల వెడల్పుతో, అవసరమైతే భవిష్యత్ లో అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీ నిర్వహించేందుకు అనుకూలంగా మొదటిదశలో 23 కిమీ పొడవునా ఈ సైకిల్ ట్రాక్ నిర్మాణం చేయబోతున్నామని చెప్పారు. ఇక రాబోయే ఎండాకాలం లోపులోనే ఈ ట్రాక్ ను నగరవాసులకు కానుకగా అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అలాగే సోలార్ ప్యానల్స్ వల్ల 16 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. భద్రతా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడిక్కడ ఫుడ్ కియోస్క్లు, టాయిలెట్లు, సైకిల్ పార్కింగ్ స్టాండ్స్, సైకిల్ రెంటల్ స్టేషన్లు, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో రెండో దశలో గండిపేట చుట్టూ 46 కి.మీ మేర ఇదే రకమైన సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY