బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ జాతీయజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి , కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్, బీజేపీ నాయకుడు విద్యాసాగర్, చింతల రామచంద్రా రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, డీకే అరుణ తదితరులు హాజరయ్యారు. గతకొంత కాలంగా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విమోచన దినోత్సవం పై ఈ రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
మరో వైపు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, పలువురు టిఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. విముక్తి దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగురవేసే సంప్రదాయాన్ని తెరాస పార్టీ ఈసారి కూడ కొనసాగించింది. ఇక గాంధీ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జానా రెడ్డి, వి హనుమంతురావు, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.
[subscribe]