టీడీపీ యువనేత దేవినేని అవినాష్ నవంబర్ 14, గురువారం నాడు వైసీపీలో చేరారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ పార్టీలో చేరారు. దేవినేని అవినాష్ కు, మరో టీడీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబుకు కండువాలు కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో అవినాష్ సమావేశమయ్యి పార్టీలో చేరిక, ఇతర అంశాలపై చర్చించారు. అంతకు ముందుగా టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖను పంపారు.
టీడీపీ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తితో కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు అవినాష్ దూరంగా ఉంటున్నారు. తన తండ్రి దేవినేని నెహ్రు అభిమానులు, అనుచరులతో నిర్వహించిన సమావేశంలో పార్టీ మారాలనే అభిప్రాయాన్నే ఎక్కువ మంది వ్యక్తపరిచినట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం సీఎం జగన్ ను కలుసుకుని చర్చించి, వైసీపీలో చేరారు. ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్బై చెప్పడం, ఇప్పుడు దేవినేని అవినాష్ పార్టీ మారడంతో కృష్ణాజిల్లాలో టీడీపీ పార్టీకి గట్టి షాక్ తగిలినట్టయింది.
[subscribe]