తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్,) మాజీ శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) సోమారపు సత్యనారాయణ జూలై 9 న పార్టీకి రాజీనామా చేశారు. సోమారపు గతంలో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ (టిఎస్ఆర్టిసి) ఛైర్మన్ గా కూడ పనిచేసారు. సోమారపు తో పాటు మాజీ కార్పొరేటర్స్, అనుచరులు పార్టీకి రాజీనామా లేఖ సమర్పించారు. 2018 డిసెంబర్ 7 న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రామగుండం నియోజకవర్గం నుండి పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ పై సత్యనారాయణ ఓడిపోయారు. అప్పటినుంచి సోమారపు సత్యనారాయణ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
రామగుండం నుంచి గెలిచిన కోరుకంటి చందర్ టిఆర్ఎస్ లో చేరినప్పటినుండి,తనకు పార్టీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని సోమారపు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు, ఈ సందర్బంగా మాట్లాడుతూ తెరాస పార్టీలో క్రమశిక్షణ లోపించిందని, పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడ తనని సంప్రదించలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో తన ఓటమికి పార్టీ లోని కొంతమంది ముఖ్యనాయకులే కారణమని ఆరోపించారు.