తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుపై ఆమె విజయం సాధించారు.
ఈ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 92 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి మొత్తం 1,89,339 ఓట్లు వచ్చినట్లు తెలిపారు. సురభి వాణీదేవి గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు మొదటి ప్రాధాన్యత ఓట్లు (1,04,668), రెండో ప్రాధాన్యత ఓట్లు (32,898) కలిపి మొత్తం 1,37,566 ఓట్లు సాధించారు. బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనే కొనసాగిన సురభి వాణీదేవి ఘన విజయాన్ని నమోదు చేశారు. సురభి వాణీదేవి విజయంతో తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ