తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణం చేయాలనీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖ కార్యాలయాల తరలింపు ఈ సోమవారం నుండి ప్రారంభమైంది. గత శని, ఆది వారాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయ భవనాల నిర్మాణం పై సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ యంత్రాగానికి, శాఖల తరలింపు పై ఆదేశాలు జారీ చేసారు. వారం రోజుల వ్యవధిలో అన్ని విభాగాలను తరలించాలని, సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది, ముందుగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లోని ఫైళ్లు మరియు ఫర్నిచర్లను ప్యాక్ చేసి బూర్గుల రామకృష్ణ భవన్ (బిఆర్కే భవన్) కు తరలిస్తున్నారు. పెద్ద కార్యాలయాలు, ఏదైనా ఒక విభాగానికి ఎక్కువ స్థలం అవసరమైతే కొత్త ప్రదేశానికి తరలించాలని భావిస్తున్నారు, కొన్ని శాఖలను ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కు మార్చాలని చూస్తున్నారు.
బూర్గుల రామకృష్ణ భవన్ లోని 8,9 అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర సాధారణ పరిపాలన శాఖలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇరిగేషన్, రోడ్లుభవనాలు, అటవీ శాఖ వంటి పెద్ద కార్యాలయాలు జల సౌధ, ఎర్రమంజిల్ లోని ఈఎన్ సీ భవనంలోకి తరలించనున్నారు. ఐటి మరియు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట సూచనలు జారీ చేసింది. వివిధ విభాగాలకు ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించడానికి ఆప్టికల్ ఫైబర్స్ ను బీఆర్కే భవన్ లో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.