ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా యూపీలోని జలౌన్ జిల్లా ఓరై తహసిల్లోని కైతేరి గ్రామంలో “బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే” ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎక్స్ప్రెస్వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో సుమారు రూ.14,850 కోట్ల వ్యయంతో 296 కిమీ మేర నాలుగు లేన్లతో బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే నిర్మించబడింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ ఎక్స్ప్రెస్వే ఈ ప్రాంతంలో కనెక్టివిటీ మరియు పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన ప్రోత్సాహాన్ని ఇస్తుందని అన్నారు.
బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే ద్వారా చిత్రకూట్ నుండి ఢిల్లీకి దూరం 3 నుంచి 4 గంటలు తగ్గించబడిందన్నారు. ఈ ఎక్స్ప్రెస్వే ఇక్కడ వాహనాలకు వేగాన్ని అందించడమే కాకుండా మొత్తం బుందేల్ఖండ్ పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేస్తుందని చెప్పారు. ఇటువంటి గొప్ప మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కేవలం పెద్ద నగరాలు మరియు దేశాలలోని ఎంపిక చేసిన ప్రాంతాలకే పరిమితమైన రోజులు పోయాయని ప్రధాని ఉద్ఘాటించారు. ఇప్పుడు సబ్కా సాథ్, సబ్కా వికాస్ స్ఫూర్తితో మారుమూల మరియు నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాలు కూడా అపూర్వమైన కనెక్టివిటీని చూస్తున్నాయన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొత్త శక్తితో కృషి చేస్తూ ముందుకు వెళ్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను అవసరాన్ని బట్టి తరువాత ఆరు లేన్ల వరకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇది చిత్రకూట్ జిల్లాలోని భరత్ కూప్ సమీపంలోని గోండా గ్రామం వద్ద నేషనల్ హైవే-35 నుండి ఎటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామం వరకు విస్తరించి ఉంది, ఇక్కడ అది ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేతో కలిసిపోతుంది. ఈ ఎక్స్ప్రెస్వే ఉత్తర్ ప్రదేశ్ లోని చిత్రకూట్, బందా, మహోబా, హమీర్పూర్, జలౌన్, ఔరైయా మరియు ఇటావా వంటి ఏడు జిల్లాల గుండా వెళ్లనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY